శ్రీవారి సన్నిధిలో నారా దేవాన్ష్ బర్త్ డే - రూ. 44 లక్షల భారీ విరాళం.
ఒక్కరోజు అన్నదాన వితరణ సీఎం ఫ్యామిలీదే…
రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న నారా కుటుంబం…
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పర్యటన ఖరారైంది. ఈ సాయంత్రం తిరుమల చేరుకోనున్న ముఖ్యమంత్రి, రాత్రికి గాయత్రీ నిలయం అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఒక్కరోజు తిరుమలలో జరిగే అన్నదాన వితరణ ఖర్చు రూ. 44 లక్షలను ముఖ్యమంత్రి కుటుంబమే భరించనుంది. దీని కోసం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు (Annaprasadam Trust) విరాళం అందజేయనున్నారు. అంతేకాకుండా, అన్నప్రసాద కేంద్రంలో ముఖ్యమంత్రి కుటుంబం స్వయంగా భక్తులకు వడ్డన చేయనుంది.
ఈ పర్యటనలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కొన్ని అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని (Command Control) సందర్శించి, భద్రతా వ్యవస్థలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ వాటర్ మరియు ఫుడ్ అనాలసిస్ ల్యాబ్తో పాటు స్టేట్ ఫుడ్ ల్యాబ్ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. భక్తులకు అందించే ప్రసాదాలు, ఆహారం యొక్క నాణ్యతను పరీక్షించడానికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాల అనంతరం రేపు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి తిరుమల నుండి తిరుగుపయనం అవుతారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా టీటీడీ మరియు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి.