- "ఏపీలో పారిశ్రామిక విప్లవం": కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Politics: ఏపీలో హాఫ్ సెంచరీ: కొత్త క్లస్టర్లతో 50కి చేరనున్న పారిశ్రామిక కేంద్రాల సంఖ్య!
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించే దిశగా కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం గుండా వెళుతున్న మూడు ప్రధాన పారిశ్రామిక కారిడార్ల వెంబడి కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.31 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 క్లస్టర్లకు అదనంగా ఈ కొత్తవి కూడా తోడైతే, ఏపీలో మొత్తం పారిశ్రామిక క్లస్టర్ల సంఖ్య 50కి చేరుకుంటుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు, మరియు హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. వీటిలో విశాఖ-చెన్నై కారిడార్ మొదటి దశ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకోగా, మిగిలిన రెండు కారిడార్ల పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక నోడ్ల అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కారిడార్ల వెంబడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఈ కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఎగుమతులు, దిగుమతులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం గుర్తించిన భూముల్లో ముంపు మరియు తీర ప్రాంతాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 74,583 ఎకరాల ముంపు భూముల్లో ఇప్పటికే 27,000 ఎకరాలు, తీరప్రాంతంలోని 56,608 ఎకరాల్లో 36,434 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ సేకరించిన భూముల్లో ముంపు ప్రాంతాల్లో 15, తీర ప్రాంతంలో మరో 15 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా సముద్ర వాణిజ్యం మరియు మారిటైం సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా తీరప్రాంత అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల తీరప్రాంత జిల్లాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పలు జిల్లాల్లో విస్తరించనున్న ఈ క్లస్టర్లను పొరుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో అనుసంధానించడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపగా, కేంద్రం నుండి నిధుల కేటాయింపు జరగనుంది. కేంద్ర నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను భరించనుంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక కీలక పారిశ్రామిక హబ్గా అవతరిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణాలో 1, గుంటూరు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 3, శ్రీసత్యసాయి జిల్లాలో 1, కడప జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 ఉన్నాయి.