విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్న ప్రభుత్వం..
పశ్చిమ గోదావరిలో రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ పనుల ప్రారంభం..
ఆచంట నియోజకవర్గంలో సోమవారం అభివృద్ధి పనుల సందడి కనిపించింది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా గ్రామపంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, కొత్త రహదారులు, సోలార్ ప్రాజెక్టులు, విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రజలకు అంకితం చేశారు. నత్తారామేశ్వరం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.20.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ – విలేజ్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించారు. గడువు గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించగా, నౌడూరు సెంటర్ నుంచి బ్రహ్మణ చెరువు వరకు రూ.2.50 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రజలకు అంకితం చేశారు.
అలాగే నెగ్గిపూడి గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టులను ప్రారంభించారు. పెనుగొండ మండలంలోని 132/33 కెవి సబ్ స్టేషన్లో కొత్త 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించడం ద్వారా విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు. వడలి నుంచి జాతీయ రహదారి-16 వరకు రూ.50 లక్షలతో నిర్మించిన డబ్ల్యూబీఎం రహదారిని కూడా మంత్రులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టామని వెల్లడించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
ప్రజలపై అదనపు భారం పడకుండా గత రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, వినియోగదారుల ఫిర్యాదులకు అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు.
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. పెరుగుతున్న గృహ, వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో మరిన్ని సబ్ స్టేషన్లు అవసరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు.
ఆచంట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీసీ వర్గాలకు సబ్సిడీతో పాటు అదనంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఇతర వర్గాల వారికి కూడా సబ్సిడీతో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.
పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు సౌర విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాలతో ఆచంట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చినట్లుగా స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.