ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. పదోన్నతుల విషయంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరటనిచ్చేలా, మొత్తం 7,514 మంది అర్హులైన ఉద్యోగుల ప్రమోషన్లపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి మంత్రి ఆర్టీసీ, రవాణా శాఖలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. మొత్తం 7,514 మంది ఉద్యోగులు ప్రస్తుతం పదోన్నతులకు అర్హులుగా ఉన్నారని తెలిపారు. వీరికి సంబంధించి 2025–26 సంవత్సరానికి సంబంధించిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) కింద ఎంప్యానల్ను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే ఉద్యోగుల్లో పని ఉత్సాహం పెరుగుతుందని, సంస్థ పనితీరుపైనా సానుకూల ప్రభావం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 44,131 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారని అధికారులు మంత్రికి తెలిపారు. రాబోయే మూడేళ్లలో వీరిలో 6,891 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో సుమారు 7,673 ఖాళీల నియామకాలకు అవకాశం ఉందని, దీనిపై ముందస్తుగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఆర్టీసీలో 682 మంది ఉద్యోగులు మెడికల్గా అన్ఫిట్గా గుర్తించబడ్డారని తెలిపారు. వీరిలో ఇప్పటికే 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించామని, మిగిలిన 646 మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉందని అధికారులు వివరించారు.
అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కూడా మంత్రి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేశారు. కొన్ని ట్రావెల్స్ బస్సులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఏపీలో తిరుగుతున్న అంశంపై ట్రావెల్స్ బస్సు యాజమాన్య సంఘాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పర్మిట్ పన్నులపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామని తెలిపారు. బస్సులు ఇతర రాష్ట్రాల్లో కాకుండా ఏపీలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏ పన్ను తగ్గింపులు అవసరమో అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల స్మార్ట్కార్డులు, డ్రైవింగ్ లైసెన్సుల టెండర్ నిబంధనలను త్వరగా ఖరారు చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే కేంద్రం తీసుకువచ్చిన వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ నిబంధన అమలుకు సంబంధించి ఆర్ఎఫ్సీ సిద్ధం చేయాలని సూచించారు.