బిష్ణుపూర్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం..
మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలకు బుద్దిచెప్పాలి..
బెంగాల్: ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. బిష్ణుపూర్లో జరిగిన భారీ ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని విపక్షాలపై, ముఖ్యంగా టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చి మోదీకి నీరాజనం పట్టారు. సభ ప్రారంభం కాకముందే ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోవడం విశేషంగా కనిపించింది.
ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బెంగాల్లో ఎక్కడికి వెళ్లినా ప్రజల ఆదరణ అద్భుతంగా ఉందని చెప్పారు. సభలు జనాలతో నిండిపోవడం ప్రజల్లో మార్పు కోరిక పెరుగుతోందని సంకేతమని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలకు ఈ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేసిన మోదీ, “టీఎంసీ ఒక సిండికేట్లా మారి బెంగాల్ ప్రజలను దోచుకుంటోంది. అవినీతి పరాకాష్టకు చేరింది. ఈ అవినీతిపరులు లొంగిపోవాల్సిందే” అని అన్నారు. ఏప్రిల్ 23న టీఎంసీ పరాజయం తప్పదని ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్ నాయకత్వం ప్రజలకు పెద్ద ద్రోహం చేసిందని, అభివృద్ధి కన్నా స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. “బీజేపీ మాత్రమే మహిళా హక్కులను కాపాడగలదు. మహిళల సాధికారతకు మేమే కట్టుబడి ఉన్నాం” అని స్పష్టం చేశారు.
కేంద్ర పథకాలను బెంగాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ, “ఇది మోదీ గ్యారంటీ” అన్నారు. అవినీతిని అంతం చేయాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఈసారి మార్పు ఖాయమని పేర్కొన్నారు. “మమత సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి.
బెంగాల్ ప్రజలు ఈసారి నిర్ణయం తీసుకోబోతున్నారు” అని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సభతో బెంగాల్ ఎన్నికల పోరు మరింత ఉత్కంఠగా మారింది. రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు కొనసాగుతుండగా, ప్రజల తీర్పుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.