విమాన టికెట్లపై డీజీసీఏ కొత్త రూల్స్…
ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసినా రిఫండ్ బాధ్యత ఎయిర్లైన్స్దే…
ప్రయాణికుల హక్కులపై డీజీసీఏ కీలక నిర్ణయం…
Flight Tickets: విమాన ప్రయాణం చేసే వారి కోసం కేంద్ర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కీలకమైన మార్పులను ప్రకటించింది. విమాన టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత వాటిని రద్దు చేయాలన్నా లేదా ప్రయాణ సమయాన్ని మార్చుకోవాలన్నా ఇప్పటి వరకు భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డీజీసీఏ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ బుక్ చేసిన 48 గంటల లోపు ఎలాంటి అదనపు రుసుము లేకుండానే ప్రయాణాన్ని రద్దు చేసుకోవచ్చు లేదా మార్పులు చేసుకోవచ్చు. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కొత్త సదుపాయాన్ని 'లుక్-ఇన్' పీరియడ్గా పిలుస్తున్నారు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. దేశీయ విమాన ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందు, అంతర్జాతీయ ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే, విమానయాన సంస్థల అధికారిక వెబ్సైట్ల ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు టికెట్ మార్చుకున్నప్పుడు కొత్త టికెట్ ధర పాత దానికంటే ఎక్కువగా ఉంటే, ఆ వ్యత్యాసాన్ని మాత్రం ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
టికెట్లపై పేరు తప్పుగా పడటం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. దీనిని సరిచేయడానికి గతంలో ఎయిర్లైన్స్ సంస్థలు వేలల్లో వసూలు చేసేవి. కానీ కొత్త రూల్స్ ప్రకారం, టికెట్ బుక్ చేసిన 24 గంటల్లోపు పేరులోని తప్పులను గుర్తించి చెబితే, ఎలాంటి ఛార్జీలు లేకుండా వాటిని సరిచేసుకోవచ్చు. ఇది సామాన్య ప్రయాణికులకు ఎంతో మేలు చేసే అంశం. పొరపాట్ల వల్ల అనవసరంగా డబ్బులు వృథా కాకుండా ఈ నిబంధన అడ్డుకుంటుంది.
టికెట్ రిఫండ్ (డబ్బు వాపసు) విషయంలో కూడా డీజీసీఏ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసిన వారికి 7 రోజుల్లోగా, నగదు రూపంలో చెల్లించిన వారికి తక్షణమే డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, రిఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత విమానయాన సంస్థలదేనని డీజీసీఏ స్పష్టం చేసింది. కొన్ని రకాల టికెట్లలో బేస్ ఫేర్ వాపసు రాకపోయినా, పన్నులు మరియు ఇతర యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలను మాత్రం తప్పనిసరిగా ప్రయాణికుడికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.