గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పలు శాఖల నుండి ఒకేసారి ఆదేశాలు రావడంతో సిబ్బంది తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఏ శాఖ ఆదేశాలను ముందుగా అమలు చేయాలి, ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కన్ఫ్యూజన్కి తెరదించేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై అన్ని శాఖలు ఒకే గైడ్లైన్ ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఏ పని చేయాలో, ఏ శాఖ ఆదేశాలను అనుసరించాలో స్పష్టత ఇవ్వడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశ్యం.
ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, సచివాలయ సిబ్బందికి ఒక సాధారణ జాబ్ ఛార్ట్ అమలులోకి వచ్చింది. ఈ ఛార్ట్ ప్రకారం సిబ్బంది నిర్వర్తించాల్సిన బాధ్యతలు స్పష్టంగా నిర్ధారించబడ్డాయి. అభివృద్ధి ప్రణాళికలు, పథకాల అమలు, సేవల డోర్ డెలివరీ, సమాచార సేకరణ, ఫిర్యాదుల పరిష్కారం, అత్యవసర విధులు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. గ్రామ, వార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నడవడానికి సిబ్బంది యాక్టివ్గా పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంటి వద్దే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కొత్త గైడ్లైన్స్ ప్రకారం, ఇకపై ఏ శాఖ అయినా ఈ నిర్దిష్ట జాబ్ ఛార్ట్కు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తే, ఆ ఆదేశాలు ఆటోమేటిక్గా రద్దు అవుతాయి. ఒకేసారి పలు పనులు అప్పగించాల్సిన పరిస్థితి వస్తే, ఆయా పనుల ప్రాధాన్యతను నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్కే ఉంటుంది. అయితే, కలెక్టర్ నిర్ణయం తీసుకునే ముందు జిల్లా సచివాలయ అధికారి, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో చర్చించడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా అనవసర ఒత్తిడి, సమన్వయం లోపాలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ నిర్ణయం అమలుపై పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే, కలెక్టర్లు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు సచివాలయ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంచుతాయని ప్రభుత్వం నమ్ముతోంది. పలు సంఘాల ఫిర్యాదులు, సిబ్బంది సూచనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.