ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త అవకాశాలను తెరవాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటి , విద్యా వ్యవహారాల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. ఈ పర్యటన 7 రోజులపాటు కొనసాగుతుంది. ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానంతో జరుగుతున్న Special Visitors Program లో భాగం.
ఈ పర్యటనలో లోకేష్ ప్రముఖ విశ్వవిద్యాలయాల చాన్సిలర్లు, అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలు, స్కిల్స్ మంత్రులు వంటి నాయకులతో సమావేశమవుతారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ, స్టార్ట్అప్ భాగస్వామ్యాలు, మరియు ఉద్యోగ అవకాశాల పెంపు అంశాలపై దృష్టి సారించనున్నారు.
అంతేకాదు, ఆయన ఆస్ట్రేలియన్ సీఫుడ్ అసోసియేషన్ ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు. అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా మన చేపల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించి, వారికి కొత్త అంతర్జాతీయ మార్కెట్లను అందించే మార్గాలను అన్వేషించనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల ఆర్థిక స్థిరత్వానికి మేలు చేయనుంది.
పర్యటనలో మరో ముఖ్య భాగం ఆస్ట్రేలియాలోని తెలుగు కమ్యూనిటీతో భేటీ. లోకేష్ గారు తెలిపారు, ప్రతి సారి విదేశాల్లో మన తెలుగువారిని కలిసినప్పుడు వారి ఆత్మీయత, అభిప్రాయాలు, ఆలోచనలు నాకు కొత్త ఉత్సాహం ఇస్తాయి. ఆంధ్ర అభివృద్ధిపై వారు చూపుతున్న ఆసక్తి నిజంగా అభినందనీయమైంది.
ఈ పర్యటన దీపావళి వేళ జరుగుతుండటం మరో ప్రత్యేకత. లోకేష్ గారు ఈసారి కూడా @FollowCII రోడ్షో లో పాల్గొంటున్నారు. ఈ రోడ్షోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఆస్ట్రేలియన్ కంపెనీలకు వివరించనున్నారు. కొన్ని ఆస్ట్రేలియన్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటే, అది మన ప్రజలకు ఈ దీపావళికి అత్యుత్తమ బహుమతి అవుతుంది” అని ఆయన ట్వీట్ చేశారు.
నిపుణుల అభిప్రాయంలో ఈ పర్యటన రాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధి, ఎగుమతులు, మరియు అంతర్జాతీయ పెట్టుబడుల రంగాల్లో కొత్త మార్గాలను తెరవనుందని అంచనా.#AndhraRising అనే నినాదానికి మరో అంతర్జాతీయ ప్రతిధ్వని ఈ పర్యటనతో ఏర్పడుతోంది.