Dhurandhar 2: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ నెల 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, కేవలం ఐదు రోజుల్లోనే రూ. 500 కోట్ల మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మాస్ ఆడియన్స్ను మెప్పించే అంశాలు పుష్కలంగా ఉండటంతో, వీక్ డేస్లో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కీలకమైన సోమవారం టెస్టును ఈ చిత్రం ఈజీగా దాటేసి, ఇండియాలో తన పట్టును నిరూపించుకుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ను "బాక్సాఫీస్ కా బాప్" (బాక్సాఫీస్ బాస్) అని పొగిడేశారు. రజనీ వంటి లెజెండ్ నుండి వచ్చిన ఈ కాంప్లిమెంట్ చూసి ఆదిత్య ధర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇది తన కెరీర్లో అత్యంత గొప్ప క్షణమని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. కేవలం ఉత్తరాదిలోనే కాకుండా, దక్షిణాదిలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రణవీర్ యాక్షన్కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, అప్పుడే ‘ధురంధర్ 3’ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మూడవ భాగం షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఈ ఊహాగానాలపై తాజాగా కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా స్పందించారు. "ప్రస్తుతానికి మూడవ భాగం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు, అవన్నీ కేవలం పుకార్లే" అని ఆయన తేల్చి చెప్పారు. ఏదైనా అప్డేట్ ఉంటే తామే స్వయంగా వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చారు.
కలెక్షన్ల విషయానికి వస్తే, ఐదవ రోజు సోమవారం నాడు దాదాపు రూ. 65 కోట్లు వసూలు చేసి అందరినీ షాక్కు గురి చేసింది. ప్రస్తుతం ఇండియాలో నెట్ కలెక్షన్ రూ. 519 కోట్లు దాటగా, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 829 కోట్లకు చేరుకుంది. అక్షయ్ కుమార్ కూడా రణవీర్ పెర్ఫార్మెన్స్ను మెచ్చుకుంటూ ఈ సినిమా ఒక ‘గ్రేట్ ఫిల్మ్’ అని కొనియాడారు. రణవీర్ సింగ్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారనే చెప్పాలి.