ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఒక్క తాటిపైకి తీసుకురావడంతో పాటు, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్లో నిన్న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కీలక కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై లోతైన చర్చ జరిగింది. అభిమానుల ఐక్యతే లక్ష్యంగా, ఫ్యాన్స్ అసోసియేషన్ను మరింత వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు నేతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సమావేశంలో స్పష్టమైన ప్రకటన చేశారు. స్టేట్ లెవల్ కమిటీతో పాటు జిల్లా, టౌన్ స్థాయి కమిటీలు ఏర్పడితే, ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ కమిటీలు అభిమానుల మధ్య సమన్వయం పెంచడంతో పాటు, ఏ కార్యక్రమం చేపట్టినా క్రమబద్ధంగా అమలు చేసేలా కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రత్యేకంగా జనసేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, వ్యక్తిత్వ విలువలను ప్రతిబింబించేలా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని నేతలు సూచించారు. కేవలం సినిమా విజయాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా అభిమానుల శక్తిని మలచాలనే ఆలోచనను ఈ సమావేశంలో ముందుకు తీసుకువచ్చారు. ఐకాన్ స్టార్కు ఉన్న దేశవ్యాప్త క్రేజ్కు తగ్గట్టుగా ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఒక బలమైన, బాధ్యతాయుతమైన వేదికగా ఎదగాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. అభిమానుల మధ్య అనవసర విభేదాలకు చోటు లేకుండా, ఐక్యతతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
టాలీవుడ్లో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు బలమైన ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్న విషయం తెలిసిందే. అవి ఎన్నేళ్లుగా క్రమపద్ధతిలో కొనసాగుతూ, సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ కూడా తన అభిమానుల కోసం ప్రత్యేకంగా బలమైన ఫ్యాన్స్ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన సందర్భంగా, అల్లు అర్జున్ తరఫున ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో లోపం కనిపించిందన్న చర్చ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా, ఫ్యాన్స్ అసోసియేషన్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అల్లు అర్జున్ గుర్తించారని అభిమానులు భావిస్తున్నారు.