పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది. ప్రతి చిన్నారి పుట్టిన నాటి నుంచే శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరం. ఈ క్రమంలో భారత ప్రభుత్వం సార్వత్రిక టీకా కార్యక్రమం (Universal Immunization Programme - UIP) ద్వారా దేశంలోని ప్రతి శిశువుకు ఉచితంగా పలు ప్రాణాంతక వ్యాధులపై టీకాలను అందిస్తోంది.
ఈ కార్యక్రమం కింద క్షయ (BCG), పోలియో, ధనుర్వాతం (టెటనస్), హెపటైటిస్-బి, డిప్తీరియా, కోరింత దగ్గు (పర్టుసిస్), మెదడువాపు (హిబ్), న్యుమోకోక్కల్, మీజిల్స్-రుబెల్లా (MR) వంటి పది కంటే ఎక్కువ టీకాలను ఉచితంగా అందిస్తున్నారు. వీటిలో కొన్ని పుట్టిన వెంటనే ఇవ్వబడుతాయి, మరికొన్ని నిర్ణీత నెలల వ్యవధిలో వేయించాలి.
వైద్య నిపుణులు చెబుతున్నట్లుగా, ఈ టీకాల వల్ల భారతదేశంలో పిల్లల మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ఉదాహరణకు, పోలియో ఒకప్పుడు భారతదేశంలో మహమ్మారి స్థాయికి చేరుకున్న వ్యాధి. కానీ ప్రభుత్వ కృషి, ప్రజల అవగాహనతో ఇప్పటికే భారత్ పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. ఇదంతా సార్వత్రిక టీకా కార్యక్రమం ఫలితమే.
ఇక క్షయ వ్యాధి (ట్యూబర్కులోసిస్) నుండి రక్షణనిచ్చే BCG టీకా పుట్టిన వెంటనే వేయాలి. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ధనుర్వాతం, డిప్తీరియా, కోరింత దగ్గు వంటి వ్యాధులు కూడా పిల్లల ప్రాణాలను తీసే ప్రమాదం కలిగినవే. వీటి నివారణకు DPT టీకా చాలా ప్రభావవంతమైంది.
టీకాలు వేయించకపోతే పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ఈ టీకాలు లేకపోతే భారతీయ సగటు ఆయుర్దాయం కేవలం 30-40 సంవత్సరాలకు పరిమితమయ్యేదట. కానీ వైద్య శాస్త్రంలో అభివృద్ధి, టీకాల అందుబాటు వల్ల ఈ రోజుల్లో భారతీయుల ఆయుర్దాయం 70 ఏళ్లకు పైగా పెరిగింది.
అలాగే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకా సేవలను అందిస్తోంది. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల టీకా షెడ్యూల్ తెలుసుకొని సమయానికి వేయించుకోవాలి. టీకా కార్డులో ప్రతి డోస్ నమోదు చేయించుకోవడం భవిష్యత్తులో రోగ నిర్ధారణకు కూడా ఎంతో సహాయకారి అవుతుంది. టీకాలు కేవలం పిల్లలకే కాకుండా, సమాజం మొత్తానికి రక్షణ కవచం. ఒక పిల్లవాడు టీకా పొందితే, అతడి చుట్టుపక్కల వారికి వ్యాధి వ్యాప్తి అవకాశాలు తగ్గుతాయి.
వైద్యులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ చెబుతున్నారు, టీకా అనేది బిడ్డకు ఇచ్చే తొలి రక్షణ గిఫ్ట్. సమయానికి వేయించండి, ఆరోగ్యంగా పెంచండి.” ప్రభుత్వం కూడా అవగాహన కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్లు, వాక్సినేషన్ డ్రైవ్ల ద్వారా ప్రజలను ప్రోత్సహిస్తోంది. పిల్లలకు టీకాలు వేయించడం కేవలం వైద్య బాధ్యత కాదు అది ప్రతి తల్లిదండ్రి కర్తవ్యం.