వెండి ధరల పెరుగుదల ఆగకుండా దూసుకుపోతోంది. పెట్టుబడిదారుల ఆసక్తిని భారీగా ఆకర్షిస్తూ ఈ తెల్లని లోహం వరుసగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఈ జనవరి నెలలోనే ఇప్పటివరకు సుమారు 22 శాతం మేర ధర పెరగడం విశేషం. ప్రధాన పెట్టుబడి సాధనాలన్నింటినీ వెనక్కి నెట్టి, వెండి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3 లక్షల మైలురాయికి అతి చేరువలో ఉండటంతో మార్కెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఒకప్పుడు బంగారానికి మాత్రమే పరిమితమైన భద్రమైన పెట్టుబడి (సేఫ్ హావెన్) గుర్తింపు, ఇప్పుడు వెండికీ బలంగా వస్తుండటం గమనార్హం.
గత శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో కిలో వెండి ధర రూ.2,87,762 వద్ద ముగిసింది. అంతకుముందు వారంలోనే రూ.2,92,960 స్థాయిని తాకి సరికొత్త ఆల్టైమ్ హైని నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్లో కిలో వెండి ధర కేవలం రూ.95,917 మాత్రమే ఉండగా, అక్కడి నుంచి దాదాపు 200 శాతం పెరగడం పెట్టుబడి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి రాబడులు మల్టీబ్యాగర్ స్టాక్స్లోనే కనిపిస్తాయి. అయితే, ఒక కమోడిటీలో ఈ స్థాయి లాభాలు నమోదు కావడం అరుదైన విషయం. ఈ ధరల ర్యాలీతో వెండి, దీర్ఘకాల పెట్టుబడిదారులకు లాభాల గనిగా మారిందనే అభిప్రాయం బలపడుతోంది.
వెండి ధరలకు ఇంతటి బలం రావడానికి అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా మారాయి. గత మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే బ్యాంకులు తమ రిజర్వుల్లో వెండినీ చేర్చుకుంటున్నాయన్న నివేదికలు మార్కెట్లో హాట్ టాపిక్గా మారాయి. దీనితో పాటు, భౌతిక వెండి (ఫిజికల్ సిల్వర్) నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం ధరలను మరింత పైకి నెట్టుతోంది. పరిశ్రమల అవసరాలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర విద్యుత్ ప్యానెల్స్ వంటి రంగాల్లో వెండి వినియోగం పెరుగుతుండటం కూడా డిమాండ్ను రెట్టింపు చేస్తోంది. ఈ అన్ని అంశాలు కలిసి వెండి ధరలకు బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి.
నిజానికి 2025 ప్రారంభంలో వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తి అంతగా కనిపించలేదు. గత ఏడాది చివరి నాటికి కిలో వెండి ధర రూ.1,10,000 వరకు చేరుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను చాలా ముందే తలకిందులు చేస్తూ ధరలు దూసుకుపోయాయి. రూ.2,54,000 స్థాయిని కూడా దాటిన వెండి, ఇప్పుడు రూ.3 లక్షల మైలురాయిని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుత ముగింపు ధర ఆధారంగా చూస్తే, ఆ మైలురాయిని దాటేందుకు కేవలం 4.2 శాతం పెరుగుదల మాత్రమే అవసరం. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారుల చూపంతా వెండిపైనే నిలిచింది. రానున్న రోజుల్లో ఈ ర్యాలీ కొనసాగుతుందా? లేక లాభాల స్వీకరణకు అవకాశం ఉందా? అన్నది మార్కెట్ ఆసక్తిగా మారింది.