దసరా, దీపావళి పండగల సీజన్ ఈసారి ఆటోమొబైల్ రంగానికి మంచి ఊపునిచ్చింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అమ్మకాలలో చరిత్ర సృష్టించింది. కేవలం 30 రోజుల్లోనే 1 లక్షకు పైగా కార్లను డెలివరీ చేయడం ద్వారా కంపెనీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 33 శాతం వృద్ధి నమోదైనట్లు సంస్థ ప్రకటించింది. నవరాత్రుల నుంచి దీపావళి వరకు సాగిన ఈ పండగ సీజన్లో టాటా మోటార్స్ అమ్మకాలు దూసుకెళ్లాయి.
టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో శైలేష్ చంద్ర మాట్లాడుతూ, “మా ఎస్యూవీ మోడళ్లు ఈ వృద్ధికి ప్రధాన కారణం. ముఖ్యంగా నెక్సాన్, పంచ్ మోడళ్లు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ను సాధించాయి” అని తెలిపారు. నెక్సాన్ మోడల్ ఒక్కటే 38,000 యూనిట్లు అమ్ముడవగా, ఇది గతేడాదితో పోలిస్తే 73 శాతం వృద్ధి అని ఆయన వివరించారు. అదే విధంగా పంచ్ మోడల్ అమ్మకాలు కూడా 32,000 యూనిట్లకు చేరి 29 శాతం వృద్ధిని సాధించాయి.
ఎస్యూవీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ టాటా మోటార్స్ అద్భుతమైన పనితీరు కనబరిచింది. పండగ సీజన్లోనే కంపెనీ 10,000కు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇది గతేడాది కంటే 37 శాతం అధికం. పర్యావరణహిత వాహనాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, ప్రభుత్వ ప్రోత్సాహం, చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ వంటి అంశాలు ఈ వృద్ధికి దోహదపడ్డాయని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మొత్తంగా ఆటోమొబైల్ రంగం మొత్తానికి ఈ పండగ సీజన్ బంపర్ హిట్టయింది. ధనత్రయోదశి రోజునే దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్లు కలిపి లక్షకు పైగా వాహనాలను విక్రయించాయి. దాని విలువ రూ.8,500 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. టాటా మోటార్స్తో పాటు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి ఇతర సంస్థలు కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి. ఈ సీజన్ విజయంతో టాటా మోటార్స్ రాబోయే నెలల్లో మరిన్ని కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.