షెడ్యూల్ ఖరారు
మూడు నగరాల్లో క్రికెట్ సందడి
రూ.35 కోట్లతో మంగళగిరి స్టేడియం ఆధునీకరణ
Andhra Premier League Season 5: తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆంధ్ర ప్రీమియర్ లీగ్ - 2026' సీజన్-5కు షెడ్యూల్ ఖరారు అయ్యింది. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ జాతర జరగనుంది. ఈ మేరకు విజయవాడలోని ఏసీఏ (ACA) అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో మంగళవారం ఫ్రాంచైజీల యజమానులతో నిర్వహించిన కీలక భేటీలో టోర్నీ షెడ్యూల్, ఏర్పాట్లపై స్పష్టతనిచ్చారు. ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు నేతృత్వంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సెక్రటరీ సానా సతీష్ బాబు పాల్గొన్నారు.
గత సీజన్ల వరకు ఏపీఎల్ మ్యాచ్లు కేవలం విశాఖపట్నానికే పరిమితం కాగా, ఈసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ను రాష్ట్రవ్యాప్తంగా అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో విశాఖతో పాటు అమరావతి ప్రాంతంలోని మంగళగిరి, రాయలసీమలోని కడప స్టేడియాల్లో కూడా మ్యాచ్లు నిర్వహించనున్నారు. జూన్ 3న మంగళగిరి అంతర్జాతీయ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు జరగనుండగా, జూన్ 28న విశాఖ వేదికగా ఫైనల్ పోరు జరగనుంది.
ఈ టోర్నీ కోసం మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. దాదాపు రూ.35 కోట్ల భారీ వ్యయంతో స్టేడియంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, రానున్న రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఏపీఎల్ ప్రధాన కార్యాలయం కూడా మంగళగిరి నుంచే పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, కడప స్టేడియంలో కూడా అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి వేలాది మంది ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
క్రికెటర్లను ప్రోత్సహించే దిశగా ఏసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆటగాళ్ల కోసం కేటాయించిన ఆక్షన్ అమౌంట్ను రూ.45 లక్షల నుంచి రూ.55 లక్షలకు పెంచింది. ఏప్రిల్ 25వ తేదీన ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో నితీష్ రెడ్డి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా భాగం కానుండటం విశేషం. గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ఈసారి డొమెస్టిక్ జిల్లా మ్యాచ్లను రెండు నెలల ముందే నిర్వహిస్తున్నామని, దీనివల్ల లోకల్ టాలెంట్కు ఏపీఎల్ ఒక గొప్ప వేదికగా మారుతుందని సానా సతీష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల కల్పనపై ఏసీఏ ప్రత్యేక దృష్టి సారించింది. బెంగళూరులోని ఎన్.సి.ఏ తరహాలోనే విజయవాడ మూలపాడు స్టేడియాన్ని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'గా తీర్చిదిద్దుతున్నామని కేశినేని చిన్ని తెలిపారు. వీటితో పాటు కాకినాడ, భీమవరం, అనంతపురంలలో కూడా ప్రాక్టీస్ మ్యాచ్ల కోసం స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో యువ క్రీడాకారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చేలా ఏసీఏ కార్యాచరణ రూపొందించిందని వివరించారు.
లీగ్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా, అత్యంత పారదర్శకతతో మ్యాచ్లు నిర్వహించేందుకు ఏసీఏ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రతీ జట్టుకు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని 'ఎథిక్స్ ఆఫీసర్'గా నియమిస్తున్నారు. టోర్నీ ముగిసే వరకు వీరు క్రీడాకారుల ప్రవర్తనను, క్రమశిక్షణను పర్యవేక్షిస్తారు.
ఈ సమావేశంలో భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ వంటి 7 జట్ల యజమానులు, ప్రతినిధులు పాల్గొని రాబోయే సీజన్ను అత్యంత గ్రాండ్గా నిర్వహించేందుకు తమ మద్దతు తెలిపారు. ఏపీఎల్ సీజన్-5 ద్వారా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోందని మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేసింది.