అమెరికాలో అట్టహాసంగా నాట్స్ తెలుగు సాంస్కృతిక సంబరాలు..
న్యూజెర్సీలో తెలుగు వైభవాన్ని చాటిన నాట్స్ వేడుకలు..
అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు అట్టహాసంగా జరిగాయి. న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో ఫోర్డ్స్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు ప్రవాస తెలుగు ప్రజలు భారీగా హాజరై సభా ప్రాంగణాన్ని కిక్కిరిసేలా చేశారు. వెయ్యికి పైగా మంది పాల్గొనడంతో కార్యక్రమం తెలుగు పండుగలా మారింది.
ఈ వేడుకల్లో ఇటీవల పద్మ పురస్కారంతో సత్కరించబడిన ప్రముఖ నటుడు డాక్టర్ మాగంటి మురళీమోహన్, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని నాట్స్ నాయకులు ఘనంగా సన్మానించారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ప్రశాంత్ పిన్నమనేని, మోహన్ కృష్ణ మన్నవ, సామ్ మద్దాలి, అరుణ గంటి, రాజ్ అల్లాడ, బిందు యలమంచిలి తదితరులు వీరిని ప్రత్యేకంగా సత్కరించారు.
సమాజానికి, తెలుగు జాతికి మురళీమోహన్, డాక్టర్ నోరి చేసిన సేవలు అపూర్వమని నాట్స్ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన మురళీమోహన్ అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మన తెలుగు మూలాలను ఎప్పటికీ మరిచిపోకూడదని సూచించారు. యువత వ్యక్తిత్వ వికాసం, జీవితంలో ఎదగడానికి అవసరమైన విలువలపై కూడా ఆయన మాట్లాడారు.
డాక్టర్ నోరి దత్తాత్రేయ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ సతీమణి బసవతారకంకు తాను చికిత్స అందించిన రోజుల్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, తెలుగు సంస్కృతిని కాపాడుకోవడమే నాట్స్ లక్ష్యమన్నారు. “భాషే రమ్యం… సేవే గమ్యం” అనే నినాదంతో సంస్థ ముందుకు సాగుతోందని తెలిపారు.
నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి మాట్లాడుతూ అమెరికాలో తెలుగు ప్రజల కోసం నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. తన హయాంలో 12 కొత్త నాట్స్ చాప్టర్లను ప్రారంభించామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్లైన్ ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లలో అమెరికా, భారత్లో నాట్స్ మరింత ప్రజలకు చేరువైందన్నారు.
నాట్స్ మాజీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ “నాట్స్ 2.0” ద్వారా భావితరాలకు తెలుగు సంస్కృతిని అందించే వారధి నిర్మించామని అన్నారు. నాట్స్ విస్తరణలో శ్రీహరి మందాడి చేసిన కృషిని ప్రశంసించారు. పాస్ట్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ కూడా శ్రీహరి నాయకత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పాస్ట్ ప్రెసిడెంట్లు, చైర్మన్లను ఘనంగా సత్కరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మదర్స్ డే సందర్భంగా “అమ్మతో అడుగులు” పేరుతో స్వర్ణ గడియారం దర్శకత్వంలో 50 మందికి పైగా తల్లులు, అమ్మమ్మలు, ముత్తాతమ్మలతో రూపొందించిన ప్రత్యేక నృత్య ప్రదర్శన అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
‘బాలల సంబరాలు’, ‘తెలుగు అమ్మాయి’ పోటీల్లో చిన్నారులు తమ ప్రతిభతో మెప్పించారు. విజేతలకు ట్రోఫీలు అందజేశారు. యువ గాయకులు హర్షిత యార్లగడ్డ, అద్వైత్ బొందుగుల ఆలపించిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. శైలజ విశ్వనాథ్ సర్వ ప్రదర్శించిన “దుర్గా ఆవిర్భవము” కూచిపూడి నృత్యం తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది.
2025 నాట్స్ తెలుగమ్మాయి పోటీల విజేతలకు కూడా ఈ వేదికపై బహుమతులు ప్రదానం చేశారు. ముద్దుగుమ్మ విభాగంలో సమిక సుబ్బారావు ప్రథమ స్థానం సాధించగా, దిషిత గండ్లూరి ద్వితీయ, శ్రీ వల్లి కోడూరి తృతీయ స్థానాల్లో నిలిచారు. కిన్నెరసాని విజేత నిహారిక బవిరిశెట్టి, కావ్యనాయకి విజేత వాహిని కాళిదాస్లను కూడా సత్కరించారు.
ఈ వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ ఉచిత ప్రవేశంతో పాటు ఘనమైన విందు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాపింగ్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన బిందు యలమంచిలి, కిరణ్ మందాడి తదితరులకు శ్రీహరి మందాడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ టీమ్ సభ్యులు, ఈసీ సభ్యులు, స్పాన్సర్లు, వాలంటీర్ల సేవలను నాట్స్ జాతీయ నాయకత్వం అభినందించింది.
డల్లాస్, డెన్వర్, ఫ్లోరిడా, ఫిలడెల్ఫియా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన నాట్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు సంస్కృతి పరిరక్షణలో నాట్స్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.