- Nara Lokesh Speech: శాసనమండలిలో లోకేష్ వర్సెస్ వైసీపీ..
- 99 పైసల భూముల వెనుక అసలు కథ!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా విశాఖపట్నంలో కంపెనీలకు భూముల కేటాయింపు అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. విశాఖను ఐటీ హబ్గా మార్చే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మంత్రి నారా లోకేష్ స్పష్టంగా వివరించగా భూముల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ సభ్యులు ఆరోపించారు.
99 పైసలకే భూములు.. మంత్రి లోకేష్ క్లారిటీ
విశాఖలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేవలం ఐదు ప్రముఖ కంపెనీలకు మాత్రమే 99 పైసలకే భూములిచ్చామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరిశ్రమలు రావాలంటే భూములివ్వడం తప్పనిసరి. క్రెడిబిలిటీ ఉన్న సంస్థలకే భూములిచ్చాం. ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాతే ఈ ప్రక్రియ జరిగింది అని వెల్లడించారు. దేశానికి వచ్చే ప్రతి 100 రూపాయల పెట్టుబడిలో 26 రూపాయలు ఏపీకే వస్తోందని, ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో తక్కువ ధరకే భూములిచ్చారు కాబట్టే, నేడు అది ఐటీలో అగ్రస్థానంలో ఉందని, విశాఖను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
రహేజాకు భూములకు ఘాటైన సమాధానం.
వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు జోక్యం చేసుకుంటూ.. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన రహేజాకు భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనికి బొత్స సత్యనారాయణ మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, రహేజా బిల్డింగ్స్లో అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయని, దానివల్ల వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. సంబంధం లేని ప్రశ్నలతో సభను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.
వైసీపీపై లోకేష్ నిప్పులు
వైసీపీ హయాంలో ఒక్క కంపెనీనైనా రాష్ట్రానికి తీసుకొచ్చారా? అని మంత్రి లోకేష్ నిలదీశారు. 2019-24 మధ్య పెట్టుబడిదారులను వేధించి తరిమేశారు. ఇప్పుడు మేము టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను తెస్తుంటే అడ్డుకుంటున్నారు. ఏపీకి పరిశ్రమలు రాకూడదని వైసీపీ కంకణం కట్టుకుంది అని మండిపడ్డారు. ఉర్సా కంపెనీకి భూములిచ్చామని నిరూపించగలరా అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి సవాల్ విసిరారు. సమాధానం వినే ఓపిక లేక ప్రతిపక్షం గందరగోళం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.
ఉత్తరాంధ్రకు ఆర్సిలర్ మిట్టల్
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఆర్సిలర్ మిట్టల్ ప్రాజెక్ట్ ఇక్కడికి రాబోతోందని మంత్రి లోకేష్ ప్రకటించారు. విశాఖను ఐటీ క్యాపిటల్ చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.