- స్కామ్కు అసలు ఆర్కిటెక్ట్ ఆయనే!
- సలహాదారు ముసుగులో భారీ కుట్ర?
- నిరాశపరిచిన బెయిల్ పిటిషన్..
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన భారీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారి రాజ్ కేసీరెడ్డేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ స్కామ్ వెనుక ఉన్న లోతుపాతులను పరిశీలిస్తే, అధికార యంత్రాంగం సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగడం అసాధ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసీరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ సలహాదారుల ముసుగులో జరిగిన అక్రమాలను తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ కుంభకోణం పరిధి చాలా పెద్దదని, వ్యవస్థలోని లోపాలను వాడుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ అధికారుల అండదండలు లేనిదే ఇలాంటి భారీ స్కామ్లు రూపుదిద్దుకోవు. పదవిలో ఉన్న కీలక వ్యక్తుల మద్దతు ఉండబట్టే అధికారులు బరితెగించారు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కుమ్మక్కయిన అధికారులను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
నిందితులకు సహకరించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన సీజేఐ విచారణ సందర్భంగా రాజ్ కేసీరెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ.. కేసీరెడ్డి కేవలం ప్రభుత్వానికి సలహాదారు మాత్రమేనని పాలనాపరమైన నిర్ణయాల్లో ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేదని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ వాదనను సీజేఐ ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయన కేవలం సలహాదారు కాదు.. ఈ మొత్తం స్కామ్కు మాస్టర్ మైండ్ అని ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
కోర్టు ధోరణి కఠినంగా ఉండటం, బెయిల్ పిటిషన్ను కొట్టివేయడం చేసేందుకు ధర్మాసనం సిద్ధమవ్వడంతో రాజ్ కేసీరెడ్డి తరపు న్యాయవాది అప్రమత్తమయ్యారు. పిటిషన్ కొట్టివేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో, తాము పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అనుమతించడంతో కేసీరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైనట్లయింది. ఈ తీర్పుతో ఏపీ మద్యం కుంభకోణం కేసులో తదుపరి విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.