- చేనేత రంగ అభిృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత
- రూ.కోటీ 70 లక్షల విలువైన చేనేత వస్త్రాలను..
Minister Savita meeting MLAs: మగ్గం మీదే నేసే వస్త్రాలను మాత్రమే ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఆప్కో బ్రాండ్ మరింత పెంచేలా షో రూమ్ ల్లో నాణ్యమైన చేనేత వస్త్రాలను మాత్రమే విక్రయించనున్నామన్నారు. గురువారం విజయవాడలోని ఓ ప్రైవేటు హొటల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రూ.కోటీ 70 లక్షల విలువైన చేనేత వస్త్రాలను ఈ సమావేశానికి చేనేత సహకార సంఘాల ప్రతినిధులు తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన అధికారులు, కేవలం మగ్గంపైనే నేసిన రూ.కోటీ 40 లక్షల విలువైన చేనేత వస్త్రాలను అక్కడికక్కడే కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
ఆప్కో బ్రాండ్ ను మరింత విస్తరించే క్రమంలో ఆయా షో రూమ్ ల్లో కేవలం మగ్గం మీద నేసే చేనేత వస్త్రాలను మాత్రమే విక్రయించనున్నామన్నారు. పవర్ లూమ్ మగ్గాల మీద నేసే వస్త్రాలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయించేది లేదని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే మగ్గం మీద నేసే చేనేత వస్త్రాలను మాత్రమే చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. ఈ నిర్ణయం వల్ల నేతన్నలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఏడాది పాటు ఉపాధి లభించే అవకాశం కలుగుతుందన్నారు. అదే సమయంలో వినియోగదారులకు నేతన్నలు నేసే నాణ్యమైన చేనేత వస్త్రాలు లభిస్తాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్కో షో రూమ్ ల్లో పవర్ లూమ్ చేనేత వస్త్రాలను విక్రయించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇకపై ఆప్కో ఇమేజ్ పెంచేలా నేటి ట్రెండ్ కు అనుగుణంగా నేతన్నలు చేనేత రెడీమేడ్ దుస్తుల తయారీపైనా దృష్టి పెట్టాలన్నారు. ఆసక్తి కలిగిన వారికి ఉచిత శిక్షణ సైతం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ కామర్స్ ద్వారా ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభించామని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి సవిత వెల్లడించారు.
చేనేత సమస్యలపై కీలక భేటీ
చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనిలో భాగంగా నేతన్నల సమస్యల పరిష్కారంతో చేనేత రంగ అభివృద్ధిపై ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, జోగేశ్వరరావు, కృష్ణప్రసాద్, షాజహాన్ బాషాతో పాటు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అధికారులతో మంత్రి సవిత గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో చేనేతల అభివృద్దికి చేపట్టిన పథకాలను మంత్రి సవిత వివరించారు. నూతన టెక్స్ టైల్స్ విధానం రూపకల్పనతో రాష్ట్రంలో చేనేత రంగానికి కొత్త శకం మొదలైందన్నారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఈ సందర్బంగా పలు చేనేత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి సవితకు ఎమ్మెల్యేలు వినతి పత్రాన్నిఅందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రధాన ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.