Mangalagiri TDP Office: అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా వినతుల స్వీకరణ' కార్యక్రమం బాధితుల గోడుతో నిండిపోయింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది బాధితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా భూ కబ్జాలు, రెవెన్యూ అధికారుల అవినీతి, ఉద్యోగాల పేరుతో జరిగిన మోసాలపై అర్జీల వెల్లువ కొనసాగింది.
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై సాగు భూములను అక్రమంగా కాజేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరానికి చెందిన సత్యన్నారాయణరాజు మాట్లాడుతూ.. తనకున్న సాగు భూమిని అడంగల్ రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని మంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎంఆర్ఓ, సర్వేయర్లు కలిసి రికార్డులు మార్చేశారని, తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే బాపట్ల జిల్లా సోపరాల గ్రామానికి చెందిన హరినారాయణ తన కుమార్తె దగ్గర తిరుపతిలో ఉన్న సమయంలో, స్థానిక చెరువు యజమాని తన పొలాన్ని ఆక్రమించాడని, కలెక్టరుకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు.
విజయవాడకు చెందిన బాయమ్మ అనే వృద్ధురాలు తన భూమి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. 2019 వరకు సాఫీగా సాగిన భూమి రికార్డులను, 2020లో అప్పటి ప్రభుత్వం 'అనాదీనం'గా మార్చేసిందని తెలిపారు. కోర్టుకు వెళ్లి అనుకూల తీర్పు తెచ్చుకున్నా, అధికారులు లంచం ఇస్తేనే ఆన్లైన్ చేస్తామని వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు, తిరుపతి జిల్లా చిన్న ఓరంపాడుకు చెందిన హరికుమార్ తన వారసత్వ భూమిని సర్వే చేయించుకోవడానికి అధికారులు అడ్డుపడుతున్నారని, క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక వ్యక్తులతో కుమ్మక్కయ్యారని ఫిర్యాదు చేశారు.
ఏలూరు జిల్లా ఈదులగూడెం గ్రామానికి చెందిన వెంకట శివ ప్రసాద్ ఇటీవల జరిగిన రీ-సర్వేలోని అక్రమాలను ఎత్తిచూపారు. తనకున్న 2.58 ఎకరాల భూమి రీ-సర్వేలో 2.44 ఎకరాలకు తగ్గిపోయిందని, పక్కనే ఉన్న రైతుకు మాత్రం భూమి పెరిగిందని వాపోయారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజు గ్రామానికి చెందిన రమేష్ కూడా రికార్డుల్లో పేర్లు తప్పుగా పడటం వల్ల తన వారసత్వ భూమి వేరొకరి పేరు మీదకు వెళ్లిందని, సాగులో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విన్నవించారు.
భూ సమస్యలే కాకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాల ఆగడాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జగ్గయ్యపేటకు చెందిన మణి అనే యువతి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఒక వ్యక్తి తమ కుటుంబం నుంచి రూ. 8 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. అలాగే పల్నాడు జిల్లా నడికుడిలో తన వారసత్వ స్థలంలో కొందరు అక్రమంగా షెడ్లు నిర్మించారని, మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినా కబ్జాదారులు ఖాతరు చేయడం లేదని బాధితుడు రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్లలో 11 సెంట్ల స్థలం పేరుతో రూ. 17 లక్షల అడ్వాన్స్ తీసుకుని మోసం చేసిన ఘటనపై సాయికృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నిమ్మల రామానాయుడు, పంచుమర్తి అనురాధ ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమవడం వల్లే సామాన్యులకు ఇన్ని కష్టాలు వచ్చాయని వారు మండిపడ్డారు. అధికారులతో మాట్లాడి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూ సమస్యలతో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, అనారోగ్య సాయం కోసం కూడా అనేకమంది విన్నపాలు సమర్పించారు.