సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పాలన గురించి నేడు మంత్రుల బృందం అధ్యయనం..
7 రోజుల శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులకు సర్టిఫికెట్లు ..
సింగపూర్: సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల శిక్షణ కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుని విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మంత్రుల బృందం సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పాలన విధానాలను లోతుగా అధ్యయనం చేసింది.
“డిజిటల్ టు ది కోర్, అండ్ సర్వ్స్ విత్ హార్ట్” అనే నినాదంతో సింగపూర్ అమలు చేస్తున్న డిజిటల్ గవర్నమెంట్ స్ట్రాటజీ గురించి మంత్రులకు వివరించారు. సింగపూర్ పౌరులు మరియు నివాసితులకు అందిస్తున్న అత్యంత సురక్షితమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ‘సింగ్పాస్ (Singpass)’ గురించి, అలాగే పౌరుల సమగ్ర మెడికల్ రికార్డులు మరియు వైద్య చరిత్రను ఎప్పుడైనా చూడగలిగేలా రూపొందించిన ఆరోగ్య సేవల యాప్ ‘హెల్త్హబ్ (HealthHub)’ వంటి సేవలపై వివరమైన ప్రదర్శన ఇచ్చారు.
ఈ వివరాలను సింగపూర్ GovTechలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవజ్ఞుడు టాన్ ఎంగ్ ఫెంగ్ మంత్రులకు తెలియజేశారు. ఆయన అనుభవాలు, సింగపూర్లో అమలు చేస్తున్న ఆధునిక డిజిటల్ సేవల గురించి వినడం మంత్రులకు ఎంతో ఉపయుక్తంగా మారింది.
అలాగే సింగపూర్లో అమలవుతున్న స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాలు, డిజిటల్ పబ్లిక్ సర్వీస్ విధానాలను ఆంధ్రప్రదేశ్లో ‘స్వర్ణాంధ్ర - 2047’ విజన్లో భాగంగా ఎలా అమలు చేయాలనే అంశంపై మంత్రులు చర్చించి, అవకాశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా టాన్ ఎంగ్ ఫెంగ్ను మంత్రులు శాలువాతో సత్కరించి, ఆయన సేవలకు అభినందనలు తెలిపారు. ఏడురోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులకు సింగపూర్ కోపరేషన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సర్టిఫికెట్లు అందజేసింది.
ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సింగపూర్లో నేర్చుకున్న ఈ ఆధునిక పాలన విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.