పార్వతీపురం, శ్రీకాకుళం, కోనసీమ జిల్లా కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్..
మూడు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష..
పార్వతీపురం, శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కీలకంగా స్పందించారు. ఈ మూడు జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రస్తుత పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు.
ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి పెట్రోల్ బంకులో నిల్వలు ఎంత ఉన్నాయి, డిమాండ్ ఎంతగా పెరిగింది వంటి అంశాలపై పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. బంకుల వద్ద పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు తెలిపారు.
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవద్దని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇలా ముందస్తుగా నిల్వ చేసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు.