- Politics: సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి…
- వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది…
Veeranjaneyaswamy: మన మిత్ర వాట్సాప్ ద్వారా రాష్ట్రంలోని వయో వృద్ధులకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖామంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి డా. స్వామి అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ 3 వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై సమావేశంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... మన మిత్ర వాట్సాప్ ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందజేస్తున్నాం. అర్హులైన వారందరికీ ఈ కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలి. సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి.
వృద్ధాశ్రమాల్లో లైట్ వెయిట్ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ, సీట్ల కేటాయింపు పటిష్టంగా అమలు చేయాలి. వృద్ధులు, దివ్యాంగుల కోసం కలెక్టర్ కార్యాలయాల్లో లిఫ్ట్ సౌకర్యంతో పాటు వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నాం. 2036 నాటికి రాష్ట్రంలో ప్రతి 5 మందిలో ఒకరు వృద్ధుడు ఉంటారు. దీన్ని అధిగమించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీకి శ్రీకారం చుడుతున్నారు. వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ సూర్యకుమారి, డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.