- సభలో కల్తీ అంశం చర్చకు వస్తే అడ్డంగా బుక్ అయ్యేది వైసీపీనే..
- వైసీపీకి చిత్తశుద్ది ఉంటే సభను సజావుగా నిర్వహించాలి..
Discussion between Ministers About YCP: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజకీయ సెగతో అట్టుడుకుతున్నాయి. టీడీఎల్పీ (TDLP) కార్యాలయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ మరియు ఎమ్మెల్యే మండిపల్లి రామ్ ప్రసాద్ భేటీ అయ్యి, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆసక్తికరమైన చర్చ జరిపారు. ముఖ్యంగా వైసీపీ తీరుపై మంత్రులు ధ్వజమెత్తిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సభలోకి దేవుడి ఫొటోలను తీసుకురావడంపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల నమ్మకాలను అడ్డం పెట్టుకుని చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వైసీపీ హయాంలోనే లడ్డూ కల్తీ జరిగిందని గతంలో వైవీ సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సభను స్తంభింపజేయడం వెనుక అసలు ప్లాన్?
"సభలో లడ్డూ కల్తీ అంశం మీద చర్చకు వస్తే వైసీపీ అడ్డంగా బుక్ అవుతుంది.. అందుకే ధర్నాల పేరుతో తప్పించుకుంటున్నారు" అని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. అసెంబ్లీని సజావుగా నిర్వహించే ఆలోచన వైసీపీకి లేదని, కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇవన్నీ చేస్తున్నారని మంత్రులు ఆరోపించారు.
జగన్ తీరుపై విమర్శలు
వైసీపీ ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేల తీరును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సభ్యులను అసెంబ్లీకి పంపుతున్నారని, సభకు ఎందుకు వస్తున్నామో, దేని మీద పోరాడుతున్నామో కూడా వైసీపీ సభ్యులకు అర్థం కావడం లేదని వారు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రస్తుతం 'లూప్ లైన్'లో ఉందని, వారి వాదనలో పస లేదని మంత్రులు తేల్చి చెప్పారు.