- "జగన్ మద్దతు ఇవ్వకుంటే ద్రోహిగా మిగిలిపోతారు": వైసీపీకి సీ.ఎం. రమేష్ సీరియస్ హెచ్చరిక..
- Politics: "రాజధాని అంటే భవనం కాదు.. ఆంధ్రుల గౌరవం": అమరావతి బిల్లుపై సీ.ఎం. రమేష్ గర్జన..
CM Ramesh: లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ సీ.ఎం. రమేష్ అత్యంత ఆవేశపూరితంగా ప్రసంగిస్తూ, అమరావతిని ప్రతి తెలుగువాడి గుండె చప్పుడుగా అభివర్ణించారు. ఈ చట్టబద్ధత బిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధానిని ప్రసాదిస్తుందని, ఇకపై అమరావతిని ఎవరూ అంగుళం కూడా కదిలించలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అచంచలమైన సహకారం అందించారని కొనియాడారు. రాజధాని అంటే కేవలం భవనాల సముదాయం కాదని, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమని పేర్కొన్న ఆయన, ప్రపంచ చరిత్రలో అమరావతి ఒక అద్భుతమైన ప్రజా రాజధానిగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై నిప్పులు చెరుగుతూ, పులివెందుల ఎమ్మెల్యే (జగన్ మోహన్ రెడ్డి) గత ఐదేళ్లూ రాజధాని పేరుతో 'మూడు ముక్కలాట' ఆడారని ఎంపీ సీ.ఎం. రమేష్ విమర్శించారు. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ అభివృద్ధిని కుంటుపరిచారని, మూడు రాజధానుల డ్రామాతో కాలక్షేపం చేశారే తప్ప రాష్ట్రానికి ఒక్క ఇటుక కూడా వేయలేదని మండిపడ్డారు. వైసీపీ చేసిన అరాచకాలను ప్రజలు భరించలేకపోయారని, ఆ పార్టీ తీరు వల్ల రాష్ట్రం ఐదేళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు. న్యాయబద్ధంగా నిరసన తెలుపుతున్న రైతులు, ముఖ్యంగా మహిళలపై గత ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తించిందని, ఇటువంటి అప్రజాస్వామిక పార్టీని దేశంలో ఎక్కడా చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి రైతుల త్యాగాలను స్మరిస్తూ, కేవలం రెండు నెలల వ్యవధిలో 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చిన ఘనత వారిదేనని ఎంపీ కొనియాడారు. డబుల్ ఇంజిన్ సర్కారుపై ఉన్న నమ్మకంతోనే రైతులు ముందడుగు వేశారని, వారి నమ్మకాన్ని ఈ బిల్లు నిలబెడుతుందని పేర్కొన్నారు. అమరావతిని నాశనం చేసేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు పన్నినప్పటికీ, నేడు శాశ్వత రాజధానిగా అది రూపుదిద్దుకోవడం శుభపరిణామమని తెలిపారు. ఇప్పటికైనా జగన్ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని, లేనిపక్షంలో చరిత్రలో ఆయన ఒక ద్రోహిగా మిగిలిపోతారని సీ.ఎం. రమేష్ హెచ్చరించారు. అమరావతి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతుందని ఆయన ఆకాంక్షించారు.