విశాఖపట్నం రైల్వేలో భద్రతా వ్యవస్థకు సరికొత్త నిర్వచనం ఇస్తూ ‘ఏఎస్సీ అర్జున్’ అనే హ్యూమనాయిడ్ రోబో తన ప్రతిభను చాటింది. దేశంలోనే తొలిసారిగా రైల్వే భద్రతా విధుల్లో ప్రవేశపెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబో, పాత నేరస్థులను గుర్తించి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఆధునిక ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ రోబో, స్టేషన్ ప్రాంగణంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రయాణికుల భద్రతకు భరోసాగా నిలుస్తోంది.
రైల్వే పోలీసుల కథనం ప్రకారం, సోమవారం రాత్రి 8.10 గంటల సమయంలో ‘అర్జున్’ స్టేషన్ పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తోంది. అప్పటికే పాత నేరస్థుల వివరాలు, ఫోటోలు రోబో సిస్టమ్లో అప్లోడ్ చేసి ఉంచారు. స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను రోబో తన హై-రిజల్యూషన్ కెమెరాతో స్కాన్ చేసి, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారు పాత నేరస్థులేనని గుర్తించింది. క్షణాల్లోనే వారి కదలికలు, చిత్రాలు, ఇతర వివరాలను సీసీటీవీ ఫుటేజీతో పాటు కంట్రోల్ రూమ్కు పంపింది.
రోబో నుంచి అందిన సమాచారం ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ బీఎస్. నారాయణ వెంటనే అప్రమత్తమయ్యారు. ఎస్సై వి. కీర్తి రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శివ, బంగారు అనే ఈ ఇద్దరి వద్ద ప్రయాణ టికెట్లు కూడా లేవని పోలీసులు గుర్తించారు. విచారణలో వీరిద్దరిపై రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసి, తదుపరి చర్యల కోసం రాయగడ పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై స్పందించిన రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్ర, పాత నేరస్థులను గుర్తించడంలో ఏఐ ఆధారిత రోబోలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టామని చెప్పారు. భవిష్యత్తులో రైల్వే స్టేషన్లు, ఇతర ప్రజా ప్రాంతాల్లో కూడా ఇలాంటి హ్యూమనాయిడ్ రోబోలను వినియోగిస్తే నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘అర్జున్’ విజయం, భద్రతా రంగంలో ఏఐ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.