- పంటల భీమాలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది..
- అరకు కాఫీ తోటల్లో ‘కాఫీ బెర్రీ బోరర్’ వ్యాధిపై తక్షణ చర్యలు... రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు..
Atchannaidu: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం,అరకులో కాఫీ తోటల నష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి శాసన మండలిలో వివరించారు. నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ స్థాయిలో పంట నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశారని, ఆ నివేదికల ఆధారంగా అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందచేశామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీపై ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 2014 వరకు పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు పంటలకు హెక్టారుకు రూ.12,000 ఇన్పుట్ సబ్సిడీని అందించేసేవారని, 2014 లో తెదేపా ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని హెక్టారుకు రూ.17,000కు పెంచినట్లు వివరించారు. అయితే గత వైసీపీ పాలనలో ఆ మొత్తాన్ని తిరిగి రూ.12,000కు తగ్గించారని మంత్రి పేర్కొన్నారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బుడమేరు వరదల సమయంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించి హెక్టారుకు రూ.25,000 వరకు నష్టపరిహారం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
బుడమేరు వరదల అనంతరం కేవలం వారం రోజుల్లోనే సర్వే పూర్తి చేసి సుమారు రూ.370 కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు అందించామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల సంభవించిన తుఫాన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే రూ.25 కోట్లు, రూ.34 కోట్లు, రూ.310 కోట్ల వరకు రైతులకు నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. ఇటీవల వచ్చిన మొందా తుఫాన్కు సంబంధించిన నష్టాల సర్వే పూర్తయిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పంటల భీమా వ్యవస్థపై వివరణ
పంటల భీమా విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పసల్ భీమా యోజనలో దేశంలోని అనేక రాష్ట్రాలు భాగస్వామ్యం అయినప్పటికీ, గత ప్రభుత్వం ఉచిత భీమా పేరుతో వేరే విధానాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించిందని, కేంద్ర ప్రభుత్వం ఆ విధానం సాధ్యం కాదని సూచించిందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో ఒక ఏడాది మాత్రమే రైతులకు భీమా అందించబడిందని, అనంతరం కేంద్రంతో కలిసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన సుమారు రూ.2000 కోట్లను మూడు సంవత్సరాల పాటు చెల్లించకపోవడంతో పోర్టల్ కూడా తెరవలేకపోయిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖల మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించామని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మళ్లీ పంటల భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
అరకు కాఫీ తోటలపై వ్యాధి నియంత్రణ చర్యలు
అరకు కాఫీ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధి పరిమిత స్థాయిలో మాత్రమే గుర్తించబడిందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం సుమారు 1.03 లక్షల హెక్టార్లలో కాఫీ సాగు జరుగుతుండగా, కేవలం 60.8 హెక్టార్లలో మాత్రమే ఈ వ్యాధి ప్రభావం కనిపించిందని తెలిపారు. సమస్య గుర్తించిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి శాస్త్రవేత్తలు, అధికారులు, కాఫీ బోర్డు ప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ ప్రారంభించిందని చెప్పారు.
వ్యాధికి గురైన 152 ఎకరాల్లోని 20,617 కిలోల కాఫీ కాయలను గుంతలు తవ్వి పాతిపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 530 మంది కూలీలు, ఉద్యాన, వ్యవసాయ శాఖ విద్యార్థులు మరియు ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. నష్టపోయిన 81 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.7,23,825 ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. అరకు కాఫీ బ్రాండ్కు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటుందని, ఎక్కడైనా వ్యాధి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని మంత్రి సభ్యులకు విజ్ఞప్తి చేశారు.