Australia: ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసాలపై కఠిన నిర్ణయాలు! భారతీయులపై భారీ ప్రభావం!

Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వం 2026 ప్రారంభం నుండి అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఆమోదాలపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల విద్యార్థుల వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి.

Published : 2026-04-12 14:47:00

ముఖ్యంగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల విద్యార్థుల వీసా తిరస్కరణ..

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా నిబంధనలు మరింత కఠినతరం..

ఆస్ట్రేలియా ప్రభుత్వం 2026 ప్రారంభం నుండి అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఆమోదాలపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల విద్యార్థుల వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది తిరస్కరణలు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఫిబ్రవరి 2026లో అంతర్జాతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు 32.5%కు చేరింది. గత 20 సంవత్సరాల్లో ఒకే నెలలో ఇంత అధిక తిరస్కరణలు నమోదవడం ఇదే మొదటిసారి. 2025లో గరిష్టంగా నమోదైన 15.5%తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ.

ప్రత్యేకంగా దక్షిణాసియా దేశాల విద్యార్థులపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నివేదికల ప్రకారం నేపాల్ విద్యార్థుల దరఖాస్తుల్లో 60.2%, బంగ్లాదేశ్ విద్యార్థులలో 47.2%, భారతీయులలో 40% వరకు వీసాలు తిరస్కరించబడ్డాయి. మరోవైపు చైనా విద్యార్థుల తిరస్కరణ రేటు కేవలం 3% వద్ద స్థిరంగా ఉండడం గమనార్హం.

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కలిపి కేవలం 34,000 విద్యార్థి వీసాలను మాత్రమే ఆమోదించారు. కరోనా కాలాన్ని మినహాయిస్తే 2013 తర్వాత ఇదే అత్యల్ప సంఖ్యగా నమోదైంది.

ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం స్టూడెంట్ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా సింప్లిఫైడ్ స్టూడెంట్ వీసా ఫ్రేమ్ వర్క్ (SSVF)లో భారతీయ విద్యార్థులను ఎవిడెన్స్ లెవెల్ 2 నుంచి లెవెల్ 3కు మార్చారు. దీంతో భారతీయులు మరింత వివరణాత్మక ఆర్థిక పత్రాలు, ఇతర ఆధారాలు సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ ప్రయాణం ప్రధాన ఉద్దేశం విద్యేనని నిరూపించాల్సి ఉంటుంది.

ఇక దేశంలో వలసల సంఖ్య పెరుగుతుండటం కూడా ఈ నిర్ణయాలకు ఒక కారణంగా భావిస్తున్నారు. 2024-25లో ఆస్ట్రేలియాలో నెట్ ఓవర్సీస్ మైగ్రేషన్ 3,06,000గా నమోదైంది. మొత్తం 5,68,000 మంది దేశంలోకి వచ్చారు. 2022లో ప్రధాని ఆంథోనీ అల్బనీస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారు 24.7 లక్షల మంది ఆస్ట్రేలియాకు చేరగా, నెట్ మైగ్రేషన్ 15 లక్షలుగా ఉంది.

హోమ్ అఫైర్స్ గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాకు అత్యధిక స్థిర వలసదారులు భారతదేశం నుంచే వెళ్తున్నారు. తరువాత చైనా, ఫిలిప్పీన్స్, యూకే, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, వియత్నాం, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.

అయితే ఈ భారీ వలసల ప్రభావంగా అద్దె ఇళ్లు, గృహాల ధరలు పెరిగాయి. దీనితో స్థానిక ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ, వన్ నేషన్ పార్టీకి మద్దతు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, నివాస వ్యయాలు పెరగడంతో సిడ్నీ నుంచి 33,000 మంది, మెల్‌బోర్న్ నుంచి 8,600 మంది ప్రజలు బయటకు వెళ్లినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ విద్యార్థులను ఆస్ట్రేలియా ఇప్పటికీ స్వాగతిస్తుందని అసిస్టెంట్ మినిస్టర్ జూలియన్ హిల్ స్పష్టం చేశారు. “నాణ్యమైన విద్య కోసం వచ్చే నిజమైన విద్యార్థులకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తాం,” అని ఆయన పేర్కొన్నారు.

మొత్తంగా చూస్తే, ఆస్ట్రేలియాలో విద్య కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా, పూర్తి డాక్యుమెంట్ లతో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →