ప్రవాసాంధ్రులను ఆకట్టుకోనున్న అన్నమాచార్య ఆరాధన మహోత్సవం..
టాసా – హెచ్టీఎస్ఏ సంయుక్తంగా అన్నమాచార్య జయంతి వేడుకలు..
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించేలా శ్రీ అన్నమాచార్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ శాన్ ఆంటోనియో మరియు హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియో సంయుక్త ఆధ్వర్యంలో మే 24, 2026 ఆదివారం “అన్నమాచార్య జయంతి ఉత్సవం”ను వైభవంగా నిర్వహించనున్నారు. ప్రవాసాంధ్రుల భక్తి, సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా ఈ వేడుక నిలవనుంది.
టెక్సాస్ రాష్ట్రంలోని హెలోట్స్ నగరంలో ఉన్న మహా లక్ష్మి హాల్ ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి వేదిక కానుంది. ప్రముఖ వైద్యులు డాక్టర్స్ హిమబిందు & రాజశేఖర్ బొర్రా ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆదివారం ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తి గీతాలతో మార్మోగనుంది. ఉదయం 8:30 గంటలకు ఆలయం నుంచి మహా లక్ష్మి హాల్ వరకు భక్తి ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి సప్తగిరి సంకీర్తనల ఆలపన కార్యక్రమం జరగనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అన్నమాచార్య ఆరాధన, సంకీర్తనలు, నాట్య సేవ కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి.
కార్యక్రమం అనంతరం భక్తులందరికీ మహాప్రసాదంగా లంచ్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు భక్తి సాహిత్య మహాకవి అన్నమాచార్య కీర్తనల స్ఫూర్తిని కొత్త తరాలకు పరిచయం చేయడమే ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశమని నిర్వాహక బృందం పేర్కొంది.
ఈ వేడుకను విజయవంతం చేయడానికి టాసా కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం టాసా అధ్యక్షుడు ఆది నారాయణ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నీరజ సుంకర, చైర్మన్ మూర్తి పటమల్ల, చైర్-ఎలెక్ట్ ప్రసాద్ తూర్లపాటి అందుబాటులో ఉంటారని తెలిపారు.
ప్రవాసాంధ్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఆహ్వాన పోస్టర్లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.