- కృష్ణా జిల్లా యనమలకుదురు శివాలయంలో నగదు మాయంపై విచారణ..
- అంతరాలయం హుండీ మారుతాళం తయారుచేసి భారీగా నగదు చోరీ..
Krishna District Temple Stole: కృష్ణా జిల్లా యనమలకుదురులోని ప్రసిద్ధ శివాలయంలో భారీ మొత్తంలో నగదు మాయమైన ఘటనపై దేవదాయ శాఖ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఆలయ ఈవో మరియు అర్చకులు కుమ్మక్కై దాదాపు రూ.10 లక్షలకు పైగా నగదును పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులు అత్యంత తెలివిగా అంతరాలయంలోని హుండీకి మారుతాళం (డూప్లికేట్ కీ) తయారు చేసి, ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, చోరీ చేసిన సొమ్ము పంపకాల్లో నిందితుల మధ్య విభేదాలు తలెత్తడంతో, ఒక మద్యం దుకాణం వద్ద వారు బహిరంగంగా గొడవ పడ్డారు. ఈ పంచాయితీ కాస్తా బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ సంగా నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కాగా, ఇద్దరు పూజారులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఆలయ ఈవో భవానీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. నేరానికి పాల్పడిన ఇద్దరు అర్చకులను మరియు ఒక ఉద్యోగిని అరెస్టు చేసినట్లు ధ్రువీకరించిన అధికారులు, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి దేవదాయ శాఖ కమిషనర్కు పంపించారు.
మరోవైపు, వివాదంలో ఉన్న ఈవో భవానీ సెలవు పెడుతున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం పంపగా, ఆమె స్థానంలో కానూరుకు చెందిన మరో ఈవోను అధికారులు తక్షణమే నియమించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ భక్తుల కానుకలను కాజేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.