Visakhapatnam Free Shop: సామాన్యుల కష్టాలను తీర్చేందుకు, పేదవారి ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు విశాఖ నగరంలో ఒక అద్భుతమైన వేదిక పుట్టుకొచ్చింది. అదే 'ఫ్రీ షాప్'. షాపు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ధరలు, బిల్లులు. కానీ, ఈ షాపులో అడుగుపెడితే మాత్రం మీకు నచ్చిన వస్తువును నేరుగా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇక్కడ ఎలాంటి ధరల పట్టికలు ఉండవు, పైసా ఖర్చు అసలే ఉండదు.
నగరానికి చెందిన విజయ్, నీరజ అనే దంపతులు సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గతేడాది సెప్టెంబరులో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు వేలమందికి ఆసరాగా నిలుస్తోంది. వీరి ఆలోచనకు స్నేహితులు, బంధువులు తోడవడంతో ఇదొక సామాజిక ఉద్యమంగా మారింది. కేవలం ఒక చిన్న గదిలో మొదలైన ఈ సేవ, నేడు సోషల్ మీడియా పుణ్యమా అని దాతల సహకారంతో విస్తరిస్తోంది.
ఈ ఫ్రీ షాపులో కేవలం పాత బట్టలు మాత్రమే కాదు.. ఒక నిరుపేద కుటుంబానికి అవసరమైన దాదాపు అన్ని వస్తువులను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు.
దుస్తులు: చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపోయే రకరకాల వస్త్రాలు.
గృహోపకరణాలు: వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు.
ఎలక్ట్రానిక్ వస్తువులు: పాత ఫ్యాన్లు, లైట్లు, ఇతర చిన్నపాటి పరికరాలు.
పాదరక్షలు: చెప్పులు, షూస్ వంటివి కూడా ఇక్కడ ఉచితంగా లభిస్తాయి.
దాతల నుంచి సేకరించిన వస్తువులను నేరుగా షాపులో పెట్టేయరు. దీని వెనుక పెద్ద కసరత్తే జరుగుతుంది. సుమారు 15 మంది వలంటీర్లు ఈ దంపతులకు సాయం చేస్తున్నారు. సేకరించిన బట్టలను ముందుగా శుభ్రంగా ఉతికించి, ఇస్త్రీ చేయిస్తారు. ఆ తర్వాతే వాటిని సైజుల వారీగా, ఆడ-మగ అనే తేడాతో విడదీసి షాపులో పెడతారు. దీనివల్ల వస్తువు తీసుకునే వ్యక్తికి అది కొత్త వస్తువులాగే కనిపిస్తుంది.
విశాఖలోని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం వెనుక ఈ షాపు ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ షాపు తలుపులు తెరుచుకుంటాయి. ఎవరైనా సరే వచ్చి, తమకు కావాల్సిన వస్తువును సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. ఎవరినీ బతిమాలాల్సిన పని లేదు, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం ఆదివారాలే కాకుండా, నెలలో రెండో శనివారం రోజున వీరు మురికివాడలకు వెళ్లి నేరుగా అవసరంలో ఉన్నవారికి వస్తువులను పంపిణీ చేస్తున్నారు.
మీ ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన వస్తువులు లేదా బట్టలు ఉంటే, వాటిని విసిరేయకుండా ఈ ఫ్రీ షాపునకు అందించవచ్చు. మీరు పంపే ఒక్క పాత షర్టు ఒక నిరుపేద కడుపు నింపలేకపోయినా, వారి మానాన్ని కాపాడుతుంది. ఇప్పటికే 3,000 మందికి పైగా ఈ సేవలను అందుకున్నారు. రాబోయే రోజుల్లో మల్కాపురంలో వెయ్యి మందికి సాయం చేయాలనే లక్ష్యంతో ఈ బృందం ముందుకు సాగుతోంది.