రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులతో రాయలసీమ దూసుకెళ్తోంది..
డ్రోన్ సిటీ, స్పేస్ సిటీతో రాయలసీమకు కొత్త దిశ..
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.
రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఐటీ రంగానికి కొత్త దిశను చూపిందని తెలిపారు.
గత 23 నెలల్లో రాయలసీమకు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాదాపు 2.4 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని శ్రీనివాసరెడ్డి వివరించారు. కర్నూలులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతుందని, దీని ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని చెప్పారు. అలాగే సత్యసాయి–తిరుపతి సరిహద్దులో స్పేస్ సిటీ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
తిరుపతి శ్రీ సిటీలో అమెరికాకు చెందిన క్యారియర్ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం, అలాగే రూ.2,805 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ రావడం ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని అన్నారు.
గతంలో తీసుకొచ్చిన కియా పరిశ్రమ వల్ల అనంతపురం ప్రాంతం అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు భూముల విలువలు భారీగా పెరిగాయని తెలిపారు. ఉద్యానవన పంటలతో రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని అన్నారు.
రాయలసీమను దేశంలోనే అగ్రగామి సోలార్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 50 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు. పులివెందులలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కూడా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపడుతోందని ఆయన తెలిపారు. డీఎస్సీ, పోలీస్, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే 16 వేల మందికి నియామక పత్రాలు అందజేశామని చెప్పారు.
గత ప్రభుత్వం పరిశ్రమలను దూరం చేసిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాయలసీమ అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, లెక్కలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు.
సంక్షేమం మరియు అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.