50 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు..
దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు..
జగిత్యాల జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం ఆలస్యమవుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పటికీ చాలా కుటుంబాలకు అందకపోవడంతో బాధితులు వేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక గల్ఫ్ మృతుడి భార్య ఇటీవల ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించారు. “మాకు ఎక్స్గ్రేషియా మంజూరు అయ్యింది. జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టోకెన్ నెంబర్ కూడా వచ్చింది. కానీ డబ్బులు మాత్రం మా బ్యాంక్ ఖాతాలో పడలేదు” అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గారు గల్ఫ్ మృతుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. పాస్పోర్ట్, మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అవసరమైన పత్రాలను మండల తహసీల్దార్ల ద్వారా వేగంగా సేకరించి, అర్హులైన కుటుంబాలను గుర్తించి ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపించారు. ఆయన కృషిని పలువురు అభినందిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 50 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేయబడింది. దీనికి మొత్తం రూ.2.5 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే కోరుట్లలో 19, ధర్మపురిలో 14, జగిత్యాలలో 7, వేములవాడలో 6, చొప్పదండిలో 4 కుటుంబాలు ఈ సహాయం కోసం అర్హులుగా గుర్తించబడ్డాయి.
అయితే, మంజూరు ప్రక్రియ పూర్తయినా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడం సమస్యగా మారింది. సీఎం హామీ ఇచ్చినా, అమలు దశలో జాప్యం జరగడం బాధిత కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. “దేవుడు వరమిచ్చాడు… పూజారి అడ్డుకుంటున్నాడు” అన్నట్లుగా పరిస్థితి ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఈ సహాయం ఎంతో కీలకం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ అంశంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటేనే, ఆ కుటుంబాలకు నిజమైన న్యాయం జరిగినట్లు అవుతుంది.