ఒక్కో చెట్టుకు రూ.200 నష్టం నుంచి యూఎన్ గుర్తింపు వరకు రైతు ప్రయాణం..
బహుళ పంటలతో రైతు జీవితాన్ని మార్చుకున్న తమిళనాడు రైతు..
తమిళనాడులో ఒకప్పుడు ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.200 నష్టపోయిన రైతు… ఇప్పుడు అదే భూమిని బంగారు పంటల తోటగా మార్చి ఎకరానికి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. పొలాచ్చి జిల్లాకు చెందిన 58 ఏళ్ల రైతు వల్లువన్ కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రకృతి స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులతో విజయాన్ని సాధించిన ఆయనకు ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (UN FAO) “సాయిల్ ఫార్మర్ హీరో”గా గుర్తింపు ఇవ్వడం విశేషం.
వల్లువన్కు 11 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. ఒకప్పుడు కొబ్బరి సాగుపై మాత్రమే ఆధారపడి జీవనం సాగించేవారు. అయితే ప్రతి చెట్టుకు సంవత్సరానికి సుమారు రూ.500 ఖర్చవుతుండగా, ఆదాయం మాత్రం రూ.300 మాత్రమే వచ్చేది. దీంతో ప్రతి చెట్టుపై నష్టం వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఇలా సాగితే వ్యవసాయం నిలబడదని అర్థమైంది. మార్పు అవసరమని అప్పుడే నిర్ణయించుకున్నాను” అని ఆయన తెలిపారు.
2009లో ఈషా ఫౌండేషన్ చేపట్టిన “సేవ్ సాయిల్ - కావేరి కాలింగ్” కార్యక్రమం వల్లువన్ జీవితంలో కీలక మలుపు తీసుకొచ్చింది. ఆ కార్యక్రమం సూచించిన బహుళ పంటలు, చెట్ల ఆధారిత వ్యవసాయ పద్ధతులను ఆయన తన పొలంలో అమలు చేశారు. మూడు రకాల పంటలతో సాగు చేస్తున్న ఆయన ఇప్పుడు ఒకే భూమిలో 14కుపైగా పంటలు పండిస్తున్నారు. కొబ్బరి, జాజికాయ, మిరియాలు, ఏడు రకాల అరటిపంటలు, పసుపు, కంద, కరివేపాకు వంటి పంటలతో పాటు 30 రకాల చెట్లను పెంచుతున్నారు.
ఈ మార్పుల తర్వాత ఆయన ఆదాయం క్రమంగా పెరిగింది. ఒకప్పుడు ఎకరానికి రూ.30 వేలే వచ్చిన స్థితి నుంచి ఇప్పుడు సంవత్సరానికి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అంతేకాదు, నేలలో సేంద్రియ కార్బన్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. మొదటి సంవత్సరంలో 0.5 శాతంగా ఉన్న ఆర్గానిక్ కార్బన్, ఏడో ఏడాదికి 1.56 శాతానికి చేరిందని వెల్లడించారు.
2017లో తమిళనాడును తీవ్రంగా ప్రభావితం చేసిన కరువు సమయంలో కూడా వల్లువన్ వ్యవసాయం నిలబడింది. రెండేళ్ల పాటు వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు వెయ్యి అడుగుల లోతుకు పడిపోవడంతో చాలా మంది రైతులు కొబ్బరి చెట్లను నరికి వేసిన పరిస్థితి ఏర్పడింది. కానీ వల్లువన్ మాత్రం మల్చింగ్ విధానం, వర్షపు నీటి నిల్వ గుంతల ద్వారా నేలలో తేమను కాపాడి పంటలను రక్షించారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయానికి గతంలో అవసరమైన నీటిలో పదో వంతు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరికొన్ని సంవత్సరాల్లో పూర్తిగా సాగునీటి అవసరం లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.
“ఎక్కువ నీరు అవసరమని రైతులు భావించే జాజికాయ, మిరియాల వంటి పంటలు కూడా అదనపు నీరు లేకుండానే బతికాయి” అని వల్లువన్ చెప్పారు. కావేరి కాలింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద్ ఎతిరాజాలు మాట్లాడుతూ… బహుళ పంటల విధానం రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని చెప్పారు. “కొబ్బరి ధర పడిపోయినా జాజికాయ ఆదుకుంటుంది. అది కూడా తగ్గితే అరటి పంట నిలబెడుతుంది. ఇలా రైతుకు అనేక ఆదాయ మార్గాలు ఉంటాయి” అని వివరించారు. దీనిని ఆయన క్రికెట్ జట్టులో సమాన ప్రతిభ కలిగిన ఆటగాళ్లతో పోల్చారు.
2019 నుంచి విస్తరించిన కావేరి కాలింగ్ కార్యక్రమం ద్వారా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రైవేట్ వ్యవసాయ భూములపై ఇప్పటికే 13.4 కోట్ల చెట్లు నాటినట్లు నిర్వాహకులు తెలిపారు. కావేరి నదీ పరీవాహక ప్రాంతంలో ఏడాది పొడవునా నీటి ప్రవాహం పునరుద్ధరించేందుకు మొత్తం 242 కోట్ల చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే ఈ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని ఆనంద్ ఎతిరాజాలు అభిప్రాయపడ్డారు. టింబర్ పంటలకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, చెట్ల విక్రయాలపై ఉన్న నిబంధనల సడలింపు, చెట్ల ఆధారిత వ్యవసాయానికి బీమా, ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. “ప్రపంచాన్ని వేధిస్తున్న గ్లోబల్ వార్మింగ్, వాతావరణ సంక్షోభానికి చెట్ల ఆధారిత వ్యవసాయమే శాశ్వత పరిష్కారం” అని వల్లువన్ విశ్వాసం వ్యక్తం చేశారు.