Fruit Bowl of India: భారతదేశం విభిన్న శీతోష్ణస్థితులకు నిలయం ఇక్కడ ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు మంచు కురుస్తూ ఉంటుంది. ఈ వాతావరణ వైవిధ్యమే మన దేశంలో రకరకాల పండ్లు పండటానికి కారణం. అయితే, అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా, హిమాచల్ ప్రదేశ్ను మాత్రం అందరూ ఎంతో ప్రేమగా "భారతదేశపు పండ్ల గిన్నె" అని పిలుచుకుంటారు. హిమాలయ పర్వతాల ఒడిలో ఉండే ఈ రాష్ట్రం, కేవలం పర్యాటకానికే కాదు, నోరూరించే పండ్ల దిగుమతికి కూడా పెట్టింది పేరు.
హిమాచల్ ప్రదేశ్కు ఈ పేరు రావడానికి ప్రధాన కారణం అక్కడి చల్లని వాతావరణం సారవంతమైన నేల. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో పండే ఆపిల్స్, చెర్రీలు, రేగు పండ్లు ఆప్రికాట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా సిమ్లా, కులు, కిన్నౌర్ వంటి జిల్లాల్లో ఎటు చూసినా కిలోమీటర్ల మేర పండ్ల తోటలే కనిపిస్తాయి. ఈ తోటలు కేవలం ప్రకృతి అందాన్ని పెంచడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తున్నాయి.
ఈ రాష్ట్రంలో పండే పండ్లలో అన్నిటికంటే ముఖ్యమైనది 'ఆపిల్'. భారతదేశంలో లభించే అత్యుత్తమ రకం ఆపిల్స్ ఇక్కడి నుంచే వస్తాయి. శీతాకాలంలో కురిసే మంచు ఆపిల్ చెట్లకు అవసరమైన చల్లదనాన్ని ఇస్తుంది, దీనివల్ల పండ్లు ఎంతో రుచిగా, రంగుగా తయారవుతాయి. కేవలం తాజా పండ్లే కాకుండా, ఇక్కడ పండే పండ్లతో తయారు చేసే జామ్లు, జ్యూస్లు, వైన్ డ్రై ఫ్రూట్స్ దేశవ్యాప్తంగా మార్కెట్ చేయబడతాయి. స్థానికులు శీతాకాలం కోసం పండ్లను ఎండబెట్టి నిల్వ చేసుకునే పద్ధతి కూడా ఇక్కడ చాలా ఫేమస్.
నిజానికి జమ్మూ కాశ్మీర్లో కూడా పండ్లు ఎక్కువగా పండుతాయి, కానీ హిమాచల్ ప్రదేశ్లో పండ్ల పెంపకం ఒక క్రమబద్ధమైన వ్యాపారంగా, ఒక సంస్కృతిగా మారిపోయింది. ఇక్కడి రైతులు తరతరాలుగా తోటల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సీజన్లో ఇక్కడి నుంచి వేల సంఖ్యలో ట్రక్కులు దేశంలోని మూలమూలలకు పండ్లను సరఫరా చేస్తాయి. అందుకే ఏ సీజన్లో చూసినా హిమాచల్ నుండి వచ్చే తాజా పండ్ల కోసం మార్కెట్లో జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
హిమాచల్ ప్రదేశ్ కేవలం మంచు కొండల రాష్ట్రం మాత్రమే కాదు, అది ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఫలవృక్షాల భాండాగారం. అక్కడి రైతుల కష్టం, హిమాలయాల చల్లదనం కలిసి మనకు తియ్యని పండ్లను అందిస్తున్నాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని 'ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా' అని పిలవడం వందకు వంద శాతం సమంజసం.