ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు..
విశాఖలో పర్యావరణం, ఎగుమతుల రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి..
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు, సీఫుడ్ ఎగుమతులపై నిర్వహించే జాతీయ స్థాయి వర్క్షాప్కు హాజరుకానున్నారు.
అధికారిక షెడ్యూల్ ప్రకారం, సీఎం చంద్రబాబు ఉదయం 9 గంటలకు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, ఉదయం 10.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తన మద్దతు తెలియజేస్తారు.
తర్వాత నిర్వహించే సైకిల్ ర్యాలీలో పాల్గొని, బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్ వరకు సైకిల్పై ప్రయాణించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.
అనంతరం నోవోటెల్ హోటల్లో జరిగే సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు ఆయన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ వర్క్షాప్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాస్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్.పీ.సింగ్ బఘేల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. అలాగే ఆక్వాకల్చర్, మత్స్య పరిశ్రమలకు చెందిన స్టార్టప్ ప్రతినిధులు, సీఫుడ్ ఎగుమతిదారుల సంఘాలు, సముద్ర ఆక్వాకల్చర్ సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులు, ఇతర భాగస్వాములు హాజరుకానున్నారు.
సమావేశంలో ప్రస్తుత సీఫుడ్ ఎగుమతుల పరిస్థితి, కొత్త మరియు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్కెట్ల అవకాశాలు, సముద్ర మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసే వ్యూహాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
అదేవిధంగా ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ-యోజన (PMKSSY), కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందజేయనున్నారు.
వర్క్షాప్ అనంతరం ముఖ్యమంత్రి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించిన అనంతరం సాయంత్రం అమరావతికి తిరిగి చేరుకుంటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్య, ఎగుమతుల రంగాల అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ పర్యటన విశాఖపట్నానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకురానుందని అధికారులు భావిస్తున్నారు.