మంగళగిరిలో సరికొత్తగా టీడీపీ మహానాడు.. టెక్నాలజీకి పెద్దపీట..
లక్షలాది కార్యకర్తలను కలపనున్న హైబ్రిడ్ మహానాడు..
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. ఈ నెల 27, 28 తేదీల్లో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ డిజిటల్ మహానాడును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఏడాది మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పల్లా గుర్తుచేశారు. పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించడం ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చలు జరపడం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈసారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మహానాడును డిజిటల్ రూపంలో నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు.
పశ్చిమాసియా యుద్ధాల నేపథ్యంలో ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ, ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్న మహానాడును రద్దు చేసి హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ఈ హైబ్రిడ్ మహానాడు ద్వారా టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని టీడీపీ భావిస్తోందన్నారు. పార్టీ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో డిజిటల్ యుగానికి అనుగుణంగా సరికొత్త విధానంలో మహానాడు జరగబోతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,848 క్లస్టర్ల ద్వారా లక్షలాది మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో అగ్రనేతలు భౌతికంగా పాల్గొంటారని, అదే సమయంలో నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మహానాడు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని వివరించారు. క్లస్టర్లలో ఉన్న కార్యకర్తలు నేరుగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. టెక్నాలజీ సాయంతో ప్రతి కార్యకర్తను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేయడం ఈ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని పేర్కొన్నారు.
హైబ్రిడ్ విధానం వల్ల ఆదా అయ్యే నిధులను పార్టీ అభివృద్ధి కోసం వినియోగిస్తామని పల్లా తెలిపారు. గతంలో వేల సంఖ్యలో మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేదని, ఇప్పుడు లక్షలాది మంది మహానాడుతో కనెక్ట్ అవుతారని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీల్లో కూడా ఈ డిజిటల్ మహానాడుపై ఆసక్తి నెలకొందన్నారు.
ఈసారి మహానాడులో “స్త్రీశక్తి” ప్రధాన అంశంగా ఉండబోతోందని తెలిపారు. మహిళా సంక్షేమం కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలు, మహిళల సాధికారతపై ప్రత్యేక చర్చలు జరుగుతాయని చెప్పారు. అలాగే ఆరోగ్యకరమైన సోషల్ మీడియా వినియోగంపై కూడా చర్చలు ఉంటాయని, “కాక్రోచ్ జనతా పార్టీ” వంటి సోషల్ మీడియా ట్రెండ్లపై కూడా స్పందన ఉండబోతుందని పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహానాడు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. పార్టీ తీర్మానాలు, రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ప్రతి క్లస్టర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించి, “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” పాటతో కార్యక్రమాలు ప్రారంభిస్తామని వివరించారు.
టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పల్లా తెలిపారు. గత 10 రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే అన్ని క్లస్టర్ల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రతి క్లస్టర్ కేంద్ర కార్యాలయంతో నిరంతరం అనుసంధానమై ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ “పసుపు పండుగ”ను విజయవంతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కుటుంబ సభ్యులకు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.