బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి..
కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు పిడుగులతో కూడిన వర్షాలు..
ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొద్ది రోజులు వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అలాగే శ్రీలంక ప్రాంతాల వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. ఈ రెండు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.
కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని కోరింది. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని హెచ్చరించింది.
రైతులు వ్యవసాయ పనుల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం, పిడుగులు పడుతున్న సమయంలో రైతులు, పశు కాపరులు చెట్ల కిందకు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.