AI యుగం ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరింది. అమెరికా, చైనా వంటి అగ్రదేశాలు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆధిపత్యం కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా కుమ్మరిస్తున్నాయి. డేటా, క్లౌడ్, చిప్స్ నుంచి కోర్ AI మోడల్స్ వరకు… ప్రతీ అంశంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటివరకు AI అంటే అమెరికా, చైనా కంపెనీలే గుర్తుకు వచ్చేవి. భారత్లో అపారమైన టెక్ ప్రతిభ ఉన్నప్పటికీ, స్వదేశీగా ప్రాథమిక AI మోడల్స్ అభివృద్ధి చేయడంలో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చే ప్రయత్నం మొదలైంది.
బెంగళూరుకు చెందిన సర్వమ్ AI (Sarvam AI) అనే స్టార్టప్ “సార్వభౌమ AI” అనే భావనతో దేశీయంగా కోర్ AI మోడల్స్ను అభివృద్ధి చేస్తోంది. విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా, భారత్లోనే మొదటి నుండి AI వ్యవస్థలను రూపొందించడమే ఈ కంపెనీ లక్ష్యం. ఈ క్రమంలో తాజాగా సర్వమ్ AI విడుదల చేసిన రెండు టూల్స్—సర్వమ్ విజన్ మరియు బుల్బుల్—టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సర్వమ్ విజన్ పనితీరు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.
సర్వమ్ విజన్ అనేది అత్యాధునిక ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే AI సాధనం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది కొన్ని కీలక బెంచ్మార్క్లలో ChatGPT, Google Gemini, Anthropic Claude వంటి ప్రపంచ ప్రఖ్యాత AI మోడళ్లను కూడా అధిగమించింది. ఈ విషయాన్ని సర్వమ్ AI సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వరుస పోస్టుల ద్వారా వెల్లడించారు. కంపెనీ సమాచారం ప్రకారం, olmOCR-బెంచ్లో సర్వమ్ విజన్ 84.3 శాతం ఖచ్చితత్వాన్ని సాధించింది, ఇది జెమిని 3 ప్రో, డీప్సీక్ OCR v2 వంటి తాజా మోడళ్ల కంటే ఎక్కువ. ముఖ్యంగా ChatGPT ఈ బెంచ్మార్క్లో చాలా వెనుకబడి ఉండటం గమనార్హం.
ఇంతటితో ఆగకుండా, OmniDocBench v1.5 అనే మరో కీలక బెంచ్మార్క్లో కూడా సర్వమ్ విజన్ అద్భుత ఫలితాలు నమోదు చేసింది. ఈ పరీక్ష AI వ్యవస్థలు వాస్తవ ప్రపంచంలో ఉన్న పత్రాలను—కాంప్లెక్స్ లేఅవుట్స్, సాంకేతిక పట్టికలు, గణిత సూత్రాలు—ఎలా చదివి అర్థం చేసుకుంటాయో పరీక్షిస్తుంది. ఇందులో సర్వమ్ విజన్ మొత్తంగా 93.28 శాతం స్కోర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విజయం భారత్ కూడా ఇకపై AI వినియోగదారుడిగా మాత్రమే కాకుండా, AI సృష్టికర్తగా ప్రపంచంలో తన స్థానాన్ని స్థిరపరుచుకునే దిశగా ముందడుగు వేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.