- అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు..
- అదరగొట్టిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్..
ICC T20 WorldCup 2026: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో పరుగుల జాతర జరిగింది. లక్షలాది మంది అభిమానుల కోలాహలం మధ్య టీమిండియా బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఆరంభంలో ఓపెనర్ల మెరుపులు, మధ్యలో సంజూ శాంసన్ క్లాస్ ఇన్నింగ్స్, చివర్లో శివం దూబే విధ్వంసంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్ అనే ఒత్తిడి అస్సలు లేకుండా, కివీస్ పేసర్ల బౌలింగ్ను చీల్చి చెండాడాడు.
మెరుపు హాఫ్ సెంచరీ: కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. పవర్ ప్లేలోనే భారత్ భారీ స్కోరుకు పునాది వేయడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్కే హైలైట్ అంటే అది ఖచ్చితంగా సంజూ శాంసన్ బ్యాటింగే. వికెట్ కీపర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన సంజూ, మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
సిక్సర్ల వర్షం: 46 బంతుల్లో 5 ఫోర్లు, ఏకంగా 8 భారీ సిక్సర్లతో 89 పరుగులు చేశాడు.
తృటిలో తప్పిన సెంచరీ: శతకానికి చేరువవుతున్న తరుణంలో అవుట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచినా, భారత్ 250 మార్కును చేరుకోవడానికి సంజూ ఆడిన ఇన్నింగ్స్ వెన్నెముకలా నిలిచింది. అభిషేక్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, 16వ ఓవర్ వేసిన జేమ్స్ నీషమ్ ఒక్కసారిగా భారత్ను భయపెట్టాడు.
వరుస వికెట్లు: సెట్ అయిన సంజూ, ఇషాన్ కిషన్లను అవుట్ చేయడమే కాకుండా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను డకౌట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో భారత్ స్కోరు కాస్త నెమ్మదించింది. స్కోరు వేగం తగ్గిందనుకున్న దశలో శివం దూబే అసలు సిసలైన ఫినిషింగ్ ఇచ్చాడు. కేవలం 8 బంతులే ఆడిన దూబే, 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
నీషమ్కు చుక్కలు: ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జేమ్స్ నీషమ్ బౌలింగ్లో దూబే ఏకంగా 24 పరుగులు (2 సిక్సులు, 3 ఫోర్లు) రాబట్టాడు. ఈ ఫినిషింగ్ టచ్తో భారత్ స్కోరు 255కు చేరుకుంది. అతనికి తోడుగా తిలక్ వర్మ (8*) నాటౌట్గా నిలిచాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్రలకు తలో వికెట్ దక్కింది. ఇప్పుడు న్యూజిలాండ్ ప్రపంచకప్ గెలవాలంటే 256 పరుగుల హిమాలయమంత లక్ష్యాన్ని ఛేదించాలి. టీ20 చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో ఇంత పెద్ద స్కోరు నమోదు కావడం ఇదే తొలిసారి.