ఉత్తరాంధ్ర ముఖద్వారమైన శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు త్వరలో పూర్తిగా మారిపోనున్నాయి. మూలపేట పోర్టు నిర్మాణంతో ఇప్పటికే పారిశ్రామికంగా కొత్త వెలుగులు చూస్తున్న ఈ ప్రాంతంలో, తాజాగా ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పోర్టుకు అనుబంధంగా దాదాపు 3,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ టౌన్షిప్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా అటు పారిశ్రామిక వేత్తలకు, ఇటు స్థానిక ప్రజలకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.
ప్రభుత్వం ఈ టౌన్షిప్లను వ్యూహాత్మకంగా రెండు ప్రధాన ప్రాంతాల్లో నిర్మించాలని భావిస్తోంది. టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట పోర్టు వరకు నిర్మిస్తున్న లింక్ రోడ్డుకు ఇరువైపులా ఒక టౌన్షిప్ను ప్లాన్ చేశారు. ఈ రహదారి పొడవునా గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేస్తూ, కిలోమీటరు పరిధి వరకు ఉన్న భూములను నివాస మరియు వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు.
మరోవైపు, నౌపడా సమీపంలోని ప్రస్తుత ఆర్అండ్ఆర్ (పునరావాస) కాలనీ వద్ద రెండో టౌన్షిప్ను ప్రతిపాదించారు. మర్రిపాడు రెవెన్యూ పరిధిలోని ఉయ్యాలపేట రోడ్డులో ఉన్న సుమారు 485 ఎకరాల జిరాయితీ ఉప్పు భూములను ఇందుకోసం గుర్తించారు.
ఈ భూములను 'భూ సమీకరణ' పద్ధతిలో సేకరించడం ద్వారా అటు రైతులకు లాభం చేకూర్చాలని, ఇటు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తును జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీవో ఇతర రెవెన్యూ అధికారులతో కలిసి ప్రతిపాదిత భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో చర్చించి, భూ సమీకరణ పద్ధతిపై వారిని ఒప్పించే బాధ్యతను స్థానిక అధికారులకు అప్పగించారు. పోర్టు రోడ్డు వెడల్పు పనులు ఇప్పటికే 100 అడుగులతో వేగంగా జరుగుతున్న తరుణంలో, ఈ టౌన్షిప్ల నిర్మాణం కూడా పూర్తయితే ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా స్వర్ణయుగాన్ని చూస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే వేల సంఖ్యలో నిపుణులు, కార్మికులు ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశం ఉంది. వారికి అవసరమైన గృహ వసతితో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, షాపింగ్ మాల్స్ వంటి వసతులను ఒకే చోట కల్పించడం ఈ టౌన్షిప్ల ప్రధాన ఉద్దేశ్యం. పోర్టుకు అనుబంధంగా వచ్చే ఇండస్ట్రియల్ క్లస్టర్లకు ఈ ప్రాజెక్టు వెన్నెముకలా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాను ఆర్థిక హబ్గా మార్చే దిశగా ఈ నిర్ణయం ఒక మైలురాయి కానుంది