పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్..
నాలుగు రోజుల్లో 1.72 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ..
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ ఆసియా పరిణామాల నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో అధికారులు దేశంలో ఇంధన, ఎరువుల నిల్వల పరిస్థితిపై వివరాలు వెల్లడించారు.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50 వేల టన్నులకు పెంచినట్లు తెలిపారు. మార్చి నెల నుంచి ఇప్పటివరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2 లక్షల 87 వేల కనెక్షన్లకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధం చేసినట్లు చెప్పారు.
గత నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి 72 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం 95 శాతానికి పైగా సిలిండర్ డెలివరీలు ఓటీపీ విధానంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి 1 లక్ష 56 వేల టన్నుల కమర్షియల్ ఎల్పీజీ అమ్ముడైందని, గత నాలుగు రోజుల్లోనే 24 వేల టన్నులకు పైగా విక్రయాలు నమోదైనట్లు చెప్పారు. అదేవిధంగా చిన్న వినియోగదారుల కోసం ఉన్న 5 కిలోల సిలిండర్లలో లక్షా 96 వేలకుపైగా విక్రయించినట్లు పేర్కొన్నారు.
ప్రజలు అవసరానికి మించి గ్యాస్ కొనుగోళ్లు చేసి ఆందోళన సృష్టించవద్దని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను కూడా వినియోగించాలని సుజాత శర్మ సూచించారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై భారత రాయబార కార్యాలయాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నావికులకు అవసరమైన సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా కుదిరిన కీలక ఒప్పందాలు దేశ ఇంధన భద్రతకు బలాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు.
ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ దేశంలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. సంవత్సరానికి అవసరమయ్యే 390 లక్షల మెట్రిక్ టన్నుల అంచనాకు గాను ప్రస్తుతం 200 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఇది సాధారణ స్థాయి కంటే ఎంతో మెరుగైన పరిస్థితి అని పేర్కొన్నారు.
దేశీయంగా ఇప్పటివరకు 95 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, దిగుమతుల రూపంలో మరో 22 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. దీంతో మొత్తం ఎరువుల లభ్యత 117 లక్షల మెట్రిక్ టన్నులను దాటిందని చెప్పారు. ఖరీఫ్ సీజన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 13 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్పీకే ఎరువులను ముందుగానే సమకూర్చుకున్నామని వెల్లడించారు.
ముడి పదార్థాలు, తయారైన ఎరువుల నిల్వలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.