జాతీయ జీడీపీలో ఏపీ వ్యవసాయ వాటా 10%.. రైతే మా ప్రాధాన్యం….
రైతన్నకు భరోసా: ‘అన్నదాత సుఖీభవ’తో ఏటా రూ.20 వేలు….
వ్యవసాయానికి భారీ బడ్జెట్: ఉచిత విద్యుత్కు రూ.13,722 కోట్లు కేటాయింపు…
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం ద్వారా ఏకంగా 10 శాతం వాటాను అందిస్తోందని, అన్నదాతను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో వ్యవసాయ, హౌసింగ్ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు 'పంచసూత్రాల' విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. నీటి భద్రత, మార్కెటింగ్, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలతో రైతన్నకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని మూడు విడతల్లో అందిస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం కేవలం రూ. 7,500 మాత్రమే ఇచ్చేదని, తాము రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే మొత్తాన్ని రూ. 14 వేలకు పెంచామని గుర్తు చేశారు. సాగుకు అవసరమైన ఉచిత విద్యుత్ కోసం ఈ బడ్జెట్లో ఏకంగా రూ. 13,722 కోట్లు కేటాయించామన్నారు. పాత ప్రభుత్వం వదిలేసిన రూ. 1,670 కోట్ల ధాన్యం బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందని, రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రతి ఘటనపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని వివరించారు.
రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రం గా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 400 మిలియన్ టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తిని 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్లస్టర్ విధానంలో ప్రభుత్వ పరంగా రూ. 30 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా మరో రూ. 70 వేల కోట్లు కలిపి.. మొత్తం లక్ష కోట్ల రూపాయల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతేకాకుండా, ఏలూరు సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద కోకో సిటీ ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
సాంకేతికతను వ్యవసాయంలో జోడించి 'ఏఐ ఆగ్రానమిస్టు' సేవలను రైతులకు చేరువ చేస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇప్పటికే రూ. 14,230 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ప్రకృతి సేద్యాన్ని భారీగా ప్రోత్సహిస్తున్నామని, ప్రస్తుతం 15 లక్షల మంది రైతులు చేస్తున్న సాగును త్వరలోనే 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. నీటి భద్రతపై దృష్టి పెట్టడం వల్లే భూగర్భ జలాలు పెరిగాయని, దీనివల్ల రూ. 95 కోట్ల విద్యుత్ ఆదా అయిందని ఆయన గణాంకాలతో వివరించారు.
ఆక్వా రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు యూనిట్ విద్యుత్ను కేవలం రూ. 1.50 కే సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. ఏపీని దేశానికే అక్వా హబ్గా మారుస్తామన్నారు. ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని, సాగునీటి సంఘాలు ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.