యాడికిలో రైతులు, సాగునీటి సంఘాలతో సమావేశం కానున్న సీఎం..
జలవనరుల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్..
రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
యాడికిలో రైతులు, సాగునీటి సంఘాల సభ్యులతో సీఎం సమావేశం కానున్నారు. నీటి వనరుల పరిరక్షణలో ప్రజలు, రైతులను భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి నీటి సంరక్షణపై అవగాహన పెంచే దిశగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సందర్భంగా జల వనరుల సంరక్షణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ను యాడికి నుంచే ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి జూలై 14 వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జల సంరక్షణలో భాగంగా సుమారు 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి కార్యాచరణను అమలు చేయనున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని అధికారులు తెలిపారు.
భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తోంది. వేసవిలో కనీసం 6 మీటర్లు, వర్షాకాలం తరువాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా కార్యాచరణ రూపొందించారు. అలాగే వర్షపు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునేలా సమగ్ర నీటి వినియోగ ప్రణాళికను అమలు చేయనున్నారు.
భవిష్యత్తులో నీటి అవసరాలు మరింత పెరగనున్న నేపథ్యంలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. నీటి వనరులను రియల్ టైమ్లో పర్యవేక్షించేందుకు ఇప్పటికే ‘అవేర్ 2.0’ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది.
నేడు సాగునీటి సంఘాలతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి మరిన్ని సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి సంరక్షణకు కొత్త దిశ దక్కుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.