Replacement Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజ్ కి కొత్త గేట్ల ఏర్పాటుకు సంబంధించి రూ 150.09 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరాలు వెల్లడించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10.13 లక్షల ఎకరాలకు సాగు, లక్షలాది మంది ప్రజలకు తాగు నీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చే ధవళేశ్వరం బ్యారేజ్ పై తమ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ డెల్టా వ్యవస్ధకు గుండె వంటిదని ఆయన పేర్కొన్నారు. 2014 లో నాటి టిడిపి ప్రభుత్వం గోదావరి డెల్టా ఆధునీకరణ కింద 31.77 కోట్లతో 175 గేట్లలో 58 కొత్త గేట్లు ఏర్పాటు చేసిన సంగతి ఆయన సభ దృష్టికి తెచ్చారు.
అలాగే 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన 117 గేట్లు మార్చడానికి 150.09 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు 2019-24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని బ్యారేజ్ ప్రమాదంలో ఉందని CWC హెచ్చరించినా కూడా పట్టించుకోలేదన్నారు.
నాడు బ్యారేజ్ కి నిధులిచ్చిన చంద్రబాబే, మరలా నేడు ధవళేశ్వరం బ్యారేజ్ కి కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్లు నిధులిచ్చారని గుర్తుచేశారు. ఈ ఏడాది జనవరిలో కాటన్ బ్యారేజ్ గేట్లు మార్పిడికి సంబంధించి టెండర్లు కూడా పిలిచామని తెలిపారు.
గోదావరి డెల్టా కాలువల్లో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టాప్ లాగ్ గేట్లను వినియోగిస్తూ, దశలవారీగా పనులు చేస్తామని సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గోదావరి డెల్టాలో ముంపు సమస్య, లాకులు, గేట్ల మరమ్మత్తులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయడానికి, లైడార్ సర్వే కోసం 13.4 కోట్లు కేటాయించామన్నారు.
ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏరియల్ లైడార్ సర్వే జరుగుతోందని రామానాయుడు చెప్పారు. గోదావరి డెల్టాలో శివారు భూములకు నీరు అందడం లేదని సభ్యులు చెప్పిన సమాచారానికి తక్షణం స్పందించామన్నారు. ఈస్టర్న్ డెల్టాకు 2200, సెంట్రల్ డెల్టాకి 1500, వెస్ట్రన్ డెల్టాగ్ 4100 క్యూసెక్కులు నీటిని విడుదల చేసి నీటి ఎద్దడి నివారిస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు.