- అపార ఖనిజ వనరుల్ని అభివృద్ధికి వినియోగించుకుందాం..
- గత ఐదేళ్లు మైనింగ్ రంగాన్ని దోపిడీ కోసం వాడుకున్నారు..
Ravindra Speech: రాష్ట్ర భవిష్యత్తును సమగ్రంగా మార్చేలా మన ఖనిజ వనరుల్ని సద్వినియోగం చేసుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకరరావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఉత్తరాంధ్ర సహా సుమారు 970 కి.మీల మేర ఉన్న సముద్ర తీరంలో అపారమైన సహజ సంపద ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే అవకాశం లభిస్తుందన్నారు. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్పై ఆధారపడి దాదాపు 102 మిలియన్ టన్నుల నిల్వలతో రాష్ట్ర ప్రభుత్వం 7,762 హెక్టార్లలో 8 బీచ్ శాండ్ కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాలను ఏపీఎండీసీకి రిజర్వ్ చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం.
శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డిపార్ట్ మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 97 మిలియన్ టన్నుల నిల్వతో గార మండలంలో 670 హెక్టార్లు, 239 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న రెండు బీచ్ శాండ్ ప్రాంతాలను ఏపీఎండీసీకి మైనింగ్ లీజు మంజూరు చేయడానికి సిఫార్సు చేశాం. గార మండలంలో 909 హెక్టార్లకుపైగా ఏకీకృత లీజు కోసం ఏపీఎండీసీకి ఎల్వోఐ జారీ చేసింది. మిగిలిన ఆరు బీఎస్ఎం బేరింగ్ ప్రాంతాల్లో డిపార్ట్ మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ ఇటీవల 41 మిలియన్ టన్నుల నిల్వలు, ఎచ్చెర్ల రణస్థలం గార మండలాల్లో మూడు బీఎస్ఎం బేరింగ్ ప్రాంతాలకు మైనింగ్ లీజులను మంజూరు చేయడానికి ఏపీఎండీసీని నామినేట్ చేసింది. చట్టబద్దమైన అనుమతులు పొందే ప్రక్రియ కొనసాగుతోంది.
బీచ్ శాండ్ ఖనిజ నిక్షేపాలతో శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో ఉన్న 4 క్వారీ లీజులు క్వార్జ్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, గ్రావెల్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ సహా మాంగనీస్ కోసం కాంపోజిట్ లైసెన్స్ కూడా అమలు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో పేర్కొన్న ఖనిజాల కోసం 301 లీజులు 1359 హెక్టార్లు, మాంగనీస్ బ్లాక్ 152 హెక్టార్లలో విస్తరించి ఉంది.
రాష్ట్రంలో అత్యంత విలువైన బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోపిడీ కోసం వాడుకున్నారు. లీజు దారుల్ని బెదిరించి లాక్కున్నారు. పెనాల్టీలతో వేధింపులకు గురి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లీజుదారులకు అండగా నిలుస్తూ.. అన్ని లీజుల్ని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
కేంద్ర ప్రభుత్వం తాజాగా క్రిటికల్ మినరల్ పార్కులు ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కారిడార్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు. మన దేశంలో విలువైన వనరులు ఉన్నప్పటికీ వాటిని ప్రాసెస్ చేసే వ్యవస్థ లేకుండా పోయింది. కానీ నేడు వాటిని ప్రాసెస్ చేసి వేల్యే యాడెడ్ పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వనరుల్ని ఉత్పత్తి చేయడం కాకుండా.. ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ ఏర్పాటు ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ తయారీ వ్యవస్థకు కీలకంగా ఏపీని మార్చబోతున్నాం.
దేశ వ్యాప్తంగా ఉన్న మోనోజైట్ నిల్వల్లో ఏపీలోనే 30 శాతానికి పైగా ఉన్నాయి. అయస్కాంతాల తయారీకి వినియోగించే నియోడైమియం, ప్రసియోడైమియం ఆధారమైన మోనోజైట్, ఏరోస్పేస్లో కీలక భూమిక పోషించే టైటానియం ఇల్మెనైట్, సిరామిక్స్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీలో కీలకంగా ఉపయోగించే జిర్కాన్, పారిశ్రామిక రంగంలో ఉపయోగించే గార్నెట్ సిల్లిమనైట్ లాంటి ఖనిజాలు ఆంధ్రప్రదేశ్ తీరంలో అత్యంత కీలకంగా లభిస్తున్నాయి. మన సముద్ర తీరంలో లభించే సంపదను మన రాష్ట్ర అభివృద్ధికి, మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.