ఉద్రిక్త ప్రాంతాలకు దూరంగా ఉండండి….
త్వరలో విమాన సర్వీసులు…
గల్ఫ్ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతర సమీక్ష.
భారత రాయబార కార్యాలయాల్లో నమోదు చేసుకోండి…
Gulf Residents: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న ప్రవాసాంధ్రులు (NRI) ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆయా దేశాల్లో చిక్కుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రవాసాంధ్రులు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ, అక్కడి అధికారిక మీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని మంత్రి సూచించారు. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిదని ఆయన హెచ్చరించారు. భారత రాయబార కార్యాలయాలతో (Indian Embassy) నిరంతరం టచ్లో ఉండాలని, తమ వివరాలను అక్కడ నమోదు చేసుకోవాలని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, త్వరలోనే విమాన సర్వీసులు కూడా ప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సమస్యల పరిష్కారానికి మరియు సమాచారం కోసం ప్రవాసాంధ్రులు ఏపీ ఎన్ఆర్టీఎస్ హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు. అత్యవసర సహాయం కోసం +91 85000 27678 మరియు +91 08632 340678 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈ నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
ప్రవాసాంధ్రుల క్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ఎటువంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం మాత్రమే వేచి చూడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.