మచిలీపట్నం చరిత్రలో మసులా బీచ్ ఫెస్ట్ మరచిపోలేనిది..
పర్యాటకులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు..
మచిలీపట్నం: మచిలీపట్నం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా మంగినపూడి బీచ్ను ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీచ్ పర్యాటకానికి మంగినపూడిని కేరాఫ్ అడ్రస్గా మార్చే లక్ష్యంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.
మంగినపూడి బీచ్లో రూ.96 లక్షల ఏపీఎండీసీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న మరుగుదొడ్లు, కాఫీ షాప్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీచ్ పరిసరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి, స్థానిక ప్రజలు, నాయకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బీచ్కు వచ్చిన పర్యాటకులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రోడ్లు, కాలువల పరిస్థితిని పరిశీలించి మరింత మెరుగుదలకు సూచనలు చేశారు.
తరువాత మంత్రి మాట్లాడుతూ, మంగినపూడి బీచ్కు గొప్ప చారిత్రక ప్రాధాన్యత ఉందని, అనేక మత విశ్వాసాలతో అనుబంధం ఉన్న ప్రదేశమని చెప్పారు. గత సంవత్సరం నిర్వహించిన మసులా బీచ్ ఫెస్ట్ మచిలీపట్నం చరిత్రలో మరచిపోలేని కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు.
2014-19 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని మెరుగుపరుస్తూ రోడ్లు, వాకింగ్ ట్రాక్స్ నిర్మించామని చెప్పారు. అయితే 2019-24 మధ్యకాలంలో బీచ్ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయి, రోడ్డు సదుపాయం కూడా లేకుండా పోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మరుగుదొడ్లు, టీ స్టాళ్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ నిధులతో రూ.90 లక్షలతో రోడ్లు నిర్మించినట్లు వెల్లడించారు.
మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, సినీ షూటింగ్స్ కోసం స్టూడియోలు, గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేసే దిశగా భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. “పోస్ట్ కార్డ్” అనే సంస్థ రిసార్ట్స్ నిర్మాణానికి ముందుకొచ్చిందని, “మైరా” సంస్థతో సినీ స్టూడియో నిర్మాణంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
అలాగే “మసులా బే పార్క్” పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పడిందని, “మెరీనా” సంస్థ బోట్స్ నిర్మాణం, పార్కింగ్ సదుపాయాల కోసం ముందుకొచ్చిందని చెప్పారు. ఈ ప్రాంతంలో హెరిటేజ్ విలేజ్ అభివృద్ధికి సినీ ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారని, డచ్, పోర్చుగీస్, బ్రిటన్ దేశాలకు చెందిన వారి పూర్వీకుల సమాధుల పరిరక్షణకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, అనుమతుల విషయంలో అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తున్నారని మంత్రి చెప్పారు. గతంలో నిర్వహించిన మసులా బీచ్ ఫెస్టివల్ భారీ విజయాన్ని సాధించిందని, లక్షలాది మంది పాల్గొని ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందేలా చేశారని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో మచిలీపట్నాన్ని పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.