మంచి పనులకు దాతల అండ
త్వరలో పాఠశాలల్లో తాగునీటి ప్లాంట్లు
విద్యలో రాజకీయాలకు తావులేదు
పేద విద్యార్థుల చదువుకు రవాణా కష్టాలు సమస్య కాకూడదనే సంకల్పంతో అద్దంకి నియోజకవర్గంలో చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఒక మహా యజ్ఞంలా కొనసాగుతోంది. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 8 వేల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. బల్లికురువ మండలం వేమవరం ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మరో 44 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు తోడుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కేవలం స్కూల్ విద్యార్థులకే కాకుండా ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే పేద విద్యార్థులకు కూడా వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ 8 వేల సైకిళ్లలో వెయ్యి సైకిళ్లను తమ సొంత కంపెనీ ద్వారా అందించడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. మనం చేసే పని మంచిదైతే సమాజం నుంచి దాతలు తప్పకుండా సహకరిస్తారు అని చెప్పడానికి ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమమే నిదర్శనమని మంత్రి అన్నారు.
విద్యార్థుల కోసం తాము పడుతున్న తపన చూసి ఒక దాత స్పందించి, పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రూ.12 లక్షల విరాళం ఇచ్చారని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ఈ నిధులతో త్వరలోనే నియోజకవర్గంలోని 8 పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
గత ప్రభుత్వ పాలనలో పేద విద్యార్థుల పట్ల జరిగిన వివక్షను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఒకసారి అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఒక తండ్రి తన వద్దకు వచ్చి.. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులు వేస్తున్నారు, రెండో వాడిని కూలికి పంపాలా? అని అడిగిన ప్రశ్న తనను కలచివేసిందని మంత్రి అన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన సానుకూలంగా స్పందించి 'తల్లికి వందనం' పథకాన్ని అందరికీ వర్తింపజేస్తున్నారని తెలిపారు.
లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కొనియాడారు. విద్యార్థులకు ఇచ్చే బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాంల విషయంలో ఎక్కడా రాజకీయ రంగులు ఉండకూడదని, సకాలంలో నాణ్యమైన వస్తువులను అందిస్తున్నామని చెప్పారు. సైకిళ్ల పంపిణీ విషయంలోనూ తాను ఎటువంటి రాజకీయ రంగులు వేయవద్దని ఆదేశించానని, పిల్లలు చదువుకుంటే వాటంతట అవే అర్థమవుతాయని గొట్టిపాటి పేర్కొన్నారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు విద్యార్థులకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు.