- మచిలీపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు: పాల కేంద్రాల్లో తనిఖీలతో వ్యాపారుల గుండెల్లో రైళ్లు!
- పాలు కొనేటప్పుడు డేట్ చెక్ చేసుకోండి: ప్రజలకు ఫుడ్ సేఫ్టీ అధికారుల కీలక సూచన..
Machilipatnam Food Safety: మచిలీపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు రాజమహేంద్రవరంలో వెలుగుచూసిన కల్తీ పాల ఉదంతం తర్వాత ఏపీ ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ విభాగంపై సీరియస్ అయ్యింది. దీంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికారులు ఇవాళ ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా నగరంలోని పాల కేంద్రాలు, బాదం పాలు విక్రయించే సెంటర్లపై అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. జనం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
మచిలీపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే జిల్లా పరిషత్ సెంటర్ (ZP సెంటర్) తో పాటు చిలకలపూడి సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడున్న పలు ప్రముఖ పాల విక్రయ కేంద్రాలకు వెళ్లి స్టాక్ను పరిశీలించారు. అక్కడ విక్రయిస్తున్న పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించేందుకు కొన్ని నమూనాలను (Samples) సేకరించారు. వీటిని వెంటనే ల్యాబ్కు పంపిస్తున్నామని, రిపోర్టులు వచ్చిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తనిఖీల సమయంలో అధికారులకు విస్తుపోయే నిజాలు కనిపించాయి. చాలా సెంటర్లలో బాదం పాలు నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్యాకెట్ల మీద కనీసం తయారీ తేదీ ఎక్స్పైరీ డేట్, కనీస ధర (MRP) కూడా లేకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో తయారు చేసిన పాలను ఫ్రిజ్లలో పెట్టి తాజావిగా అమ్ముతున్నట్లు అధికారులు గమనించారు. ఇలాంటి పాలు తాగడం వల్ల చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం లాభాల కోసమే చూసుకుంటే కుదరదని, నాణ్యమైన పాలు మాత్రమే ప్రజలకు అందించాలని అధికారులు వ్యాపారులకు సూచించారు. నిల్వ ఉంచిన పాలు విక్రయించే ఫ్రిజ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కూడా పాలు కొనేటప్పుడు ప్యాకెట్ మీద తేదీలను చెక్ చేసుకోవాలని కోరారు. రాజమహేంద్రవరం ఘటన తర్వాత ప్రభుత్వం అలర్ట్ కావడంతో, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.