Juvvaladinne Fishing Harbor: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు దేశం మొత్తాన్ని తనవైపు ఆకర్షించేందుకు సిద్ధం అవుతుంది. ఇక్కడ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మెగా ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను తిలకించారు. సముద్ర గర్భంలో పనిచేసే రోబోటిక్స్, అత్యాధునిక షిప్ బిల్డింగ్ సాంకేతికతపై ప్రతినిధులతో చర్చించారు.
ఈ ప్రాజెక్టు కేవలం పరిశ్రమ స్థాపన మాత్రమే కాదు, స్థానిక యువతకు ఒక వరం అని చెప్పాలి. మొదటి దశలో సాగర్ డిఫెన్స్ సంస్థ రూ. 45 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా దాదాపు వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం సాధారణ పనులే కాకుండా మెరైన్ ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) వంటి ఉన్నత స్థాయి రంగాల్లో యువతకు ఉపాధి దొరకడం గమనార్హం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును 200 ఎకరాల విస్తీర్ణానికి పెంచే ప్రణాళికలు ఉన్నాయి.
పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు కోసం వేగంగా అడుగులు వేసింది. జువ్వలదిన్నె హార్బర్ సమీపంలో మొదటి దశ కింద 29.58 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో నీటి అంచున ఉండే 7.58 ఎకరాల ప్రత్యేక భూమి కూడా ఉంది. 2026 నవంబర్ నాటికి ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు, అంటే నౌకల తయారీ ప్రయోగాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి.
ఈ షిప్ యార్డ్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 'బ్లూ ఎకానమీ' లో కీలక పాత్ర పోషించనుంది. దేశంలోనే తొలిసారిగా స్వయంచాలక నౌకల తయారీ కేంద్రం ఇక్కడ రావడం వల్ల ఏపీ మారిటైం రోబోటిక్స్ హబ్ గా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. సముద్ర భద్రతలో వాడే అత్యాధునిక సిస్టమ్స్ ఇక్కడే తయారవ్వడం రాష్ట్రానికే గర్వకారణం. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నామని, యువతకు స్థానికంగానే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మరియు టీడిపి శ్రేణులు ఆయనకు కప్పరాలతిప్ప వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సాగర్ డిఫెన్స్ సీఈవో కెప్టెన్ నికుంజ్ పరాశర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు.